హైదరాబాద్ : అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గంలోని కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక వన మహోత్సవం లో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు.
అధికారంలో ఉన్నామని వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం బాధకరమని పేర్కొన్నారు. అమీర్పేట లో టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 1994లో ఎన్టీఆర్ తనకు రాజకీయ జీవితం ప్రసాధించిన మహనీయుడుని ఎన్నటికీ మరవనని స్పష్టం చేశారు.
బన్సీలాల్ పేట డివిజన్ లో విస్తృత ప్రచారం
బన్సీలాల్ పేట డివిజన్లో మంత్రి తలసాని శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గత ప్రభుత్వాలు ఇండ్ల నిర్మాణం కోసం నామమాత్రపు ఆర్ధిక సహాయం అందించాయని ఆరోపించారు. పేదల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్(CM KCR) అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా అందజేశారని వెల్లడించారు. నగరంలో ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల వరకు తాగునీరు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సాధ్యమని ఆయన అన్నారు.