హైదరాబాద్ : రిటైర్ట్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ జాప్యంపై సరైన వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారికి చెందాల్సిన బెనిఫిట్స్ను వెంటనే చెల్లించాలని పలు మార్లు కోర్టు ఆదేశించినా పట్టించుకునే వారే కరువయ్యారు. తాజాగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరోకరు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్ మహ్మద్ అన్సారీ రెండేళ్లుగా ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడంలేదని, వెంటనే అతనికి బెనిఫిట్స్ అందించి అతని ప్రాణాలు కాపాడాలని డిమాండ్ బంధుమిత్రులు చేస్తున్నారు. అతనికి ఏమన్నా జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వం, యూనివర్సిటీ యాజమాన్యానిదేనని హెచ్చరించారు.
కాగా, ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
‘పెన్షన్ బకాయిలు చెల్లించడానికి అదేమైనా మీ సొంత డబ్బు అనుకుంటున్నారా? ఉద్యోగుల కష్టార్జితమే ఇస్తున్నారని తెలియదా? ఉద్యోగ విరమణ చేసిన వాళ్లు చకోరపక్షుల్లా ఎదురుచూడాల్సిందేనా? కండ్లు కాయలు కాసేలా నిరీక్షించి కన్ను మూయాల్సిందేనా? రిటైర్డు ఉద్యోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టకపోతే ఏమనుకోవాలి! ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 80 మందికిపైగా రిటైర్డు ఉద్యోగులు ప్రాణాలు వదిలేశారు. రిటైర్డు ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వంలో కదలిక లేకపోతే ఎలా? ఆరు నుంచి తొమ్మిది మాసాల గడువు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.
నత్తనడకలా వ్యవహారం ఉంటుందంటే ఉపేక్షించే ప్రసక్తే లేదు’ అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. ‘ఇదే చివరి అవకాశమని గుర్తుంచుకొని వ్యవహరించండి. ఏప్రిల్ 9 వరకు గడువు ఇస్తున్నాం. అప్పటిలోగా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్, మ్యుటేషన్, గ్రాట్యుటీ, ఆర్జిత సెలవు, సరెండర్ సెలవు, గ్రూపు ఇన్సూరెన్స్ వంటి ఉద్యోగ ప్రయోజనాలను చెల్లించాల్సిందే’ అని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు సోమవారం కీలక ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే.