10 లక్షల విరాళమిస్తే డైరెక్టర్గా నియమించే అవకాశం
తక్కువ విరాళమిచ్చిన వారికి కూడా ఇతర పోస్టులు
ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ
సిటీబ్యూరో, మార్చి 26: ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థుల సౌకర్యార్థం అదనంగా హాస్టళ్లు, కొత్త డైరెక్టరేట్లు, అదనపు గదుల నిర్మాణాలు, ఇండోర్ గేమ్స్, డిజిటల్, సైన్స్ ల్యాబులు ఆధునీకరణ వంటి వాటిని నిర్మించడంపై ఓయూ అధికారులు దృష్టి సారించారు. ఇందుకు సొంతంగా నిధుల సమీకరణపై దృష్టి పెట్టారు. 104 ఏండ్ల చరిత్ర కలిగిన ఓయూలో ఎందరో పూర్వ విద్యార్థులు ఉన్నారు. వారిలో ఎందరో అత్యున్నత స్థానాలలో ఉన్నారు. రాజకీయ నాయకులుగా, పారిశ్రామిక వేత్తలుగా, ప్రభుత్వ అధికారులకు, ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటు లాయర్లు, జడ్జీలతో పాటు ఇతర దేశాలలో స్థిరపడి పెద్ద వ్యాపార దిగ్గజాలుగా ఎందరో తయారయ్యారు. వారంతా ఓయూ అభివృద్ధి కోసం భాగస్వాములం కావాలని భావిస్తున్నారు. అతి పెద్ద చరిత్ర కలిగిన ఓయూ పూర్వ విద్యార్థుల నుంచి భారీగా నిధులు ఇవ్వడానికి వారు ముందుకు వస్తున్నట్లు సమాచారం.
రూపుదిద్దుకుంటున్న సమగ్ర విధానం
ఓయూ అధికారులు ఆధ్వర్యంలో ఒక సమగ్ర విధానం రూపుదిద్దుకుంటున్నది. వారి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం నిధుల సమీకరణ చేయాలన్నదే ఓయూ లక్ష్యం. పూర్వ విద్యార్థుల ద్వారా సేకరించిన నిధులు దుర్వినియోగం కాకుండా ఓయూ అధికారులు ఒక ప్రత్యేక డైరెక్టరేట్ను ఏర్పాటు చేయనున్నారు. దానికి ఓయూ అధికారులు, ప్రభుత్వ అధికారులతో ఎలాంటి సంబంధాలు లేకుండా పూర్వ విద్యార్థులనే డైరెక్టర్లుగా, సభ్యులుగా, కన్వీనర్లుగా నియమించనున్నారు.
అయితే, అందులో రూ.10 లక్షల విరాళం ఇచ్చిన వారే డైరెక్టర్ నియామకానికి అర్హతగా పరిగణిస్తున్నారు. అంత కంటే తక్కువ విరాళం ఇచ్చిన వారిని సభ్యులుగా ఇతర పోస్టులకు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. సేకరించిన నిధులు ఖర్చు చేయడం, నియంత్రించడం వంటి కార్యకలాపాలన్ని కూడా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలోనే కొనసాగుతాయని ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ తెలిపారు.