మానవుడి జీవిత కాలం వందేండ్లు. పూర్వీకులు వంద, వందకు పైగా జీవించేవారు. ప్రస్తుతం ఆ వయస్సు 60కి పడిపోయింది. వందేండ్లు బతకాల్సిన మానవులు రోగాలు, రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో మధ్య వయస్సుల్లోనే తనువు చాలిస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి మానవుడి వయస్సు పెంచేందుకు జీవశాస్త్రీయ కోణాల్లో అధ్యాయనం చేసిన వైద్య నిపుణులు మనిషిని వందేండ్లు బతికించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టి ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధిస్తున్నారు. దేవుడు వందేండ్లు ఆయుష్యును ఇస్తే.. దానిని మనిషి పూర్తి చేసేందుకు వైద్యులు కృషిచేస్తున్నారు. ఇందుకు అవయవ దానం ప్రధాన భూమికను పోషిస్తున్నది. జీవన్మృతి మధ్య పోరాటం చేస్తున్న వారి అవయవాలను రోగాల బారిన పడి కొట్టుమిట్టాడుతున్న వారికి దానం చేసి పునర్జీవనం పోస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్థాపించిన ‘జీవన్దాన్’ సంస్థ ద్వారా ఇప్పటికే 3వేల మందికి పునర్జీవం పోసింది. ఆగస్టు 13న ‘ప్రపంచ అవయవదాన దినం’ సందర్భంగా ప్రత్యేక కథనం..!
మనుషులకు పునర్జన్మ ఇచ్చే అవయవాలను దానం చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 13ను ‘ప్రపంచ అవయవ దాన దినం’గా పరిగణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి ఏటా సుమారు 4.5లక్షల మంది రోగులు వారిలోని ప్రధాన అవయవాలు పనిచేయక పోవడంతో మృత్యువాత పడుతున్నారు. వీరిని బతికించాలంటే రోగులకు అవసరమైన అవయవాలను మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇంతటి విలువైన అవయవాలను సేకరించడం, అవసరమున్న రోగులకు అమర్చేందుకు 2013లో రాష్ట్ర ప్రభుత్వం ‘జీవన్దాన్’ పేరుతో ప్రత్యేక సంస్థను స్థాపించింది. నాటి నుంచి 3వేల మంది రోగులకు అవయవ దాన శస్త్రచికిత్సలు జరిపి, పునర్జీవం ప్రసాదించారు. జీవన్దాన్ గణాంకాల ప్రకారం ప్రస్తుతం మరో 4730మంది రోగులు వివిధ అవయవాల కోసం నిరీక్షణ జాబితాలో ఉన్నారు.
రోజురోజుకూ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్కు డిమాండ్ పెరుగు తున్నది. యువతలో 60శాతం మంది కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్ బారిన పడుతున్నారు. సకాలంలో కిడ్నీ మార్పిడి చేయకపోవడంతో డయాలసిస్ స్టేజ్లోనే మృత్యువాత పడుతున్నారు. అవగాహన లేకపోవడంతోనే ఇలా జరుగుతున్నది. అవయవ దానం వల్ల కిడ్నీ మార్పిడితో కొంత మంది రోగులకు కొత్త జీవితాన్ని ఇస్తున్నాం. దాతల సంఖ్య కంటే రిసీవర్స్ సంఖ్య మూడు, నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. బతికున్న వారినుంచి, బ్రెయిన్డెత్ అయిన వారినుంచి కాడోవర్ పద్ధతిలో కిడ్నీ మార్పిడి చేయవచ్చు. లైవ్ డోనర్స్ దొరకడం కష్టమవుతున్నది. ఫలితంగా ఒక కిడ్నీ కోసం బాధితుడు కనీసం మూడు నుంచి ఐదేండ్లు నిరీక్షించాల్సి వస్తున్నది.
16, 30 ఏండ్ల లోపువారు ఎక్కువగా ‘గొమరుల్లార్’, ‘ఇంటర్సీషయల్’ వ్యాధులబారిన పడటంతో, 40 ఏండ్లు పైబడిన వారికి షుగర్తో కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. కిడ్నీ మార్పిడి 98 శాతం సక్సెస్గా ఉన్నది. డోనర్, రిసీవర్ల కిడ్నీలు మ్యాచ్ కాకపోయినా విజయవంతంగా పనిచేసేలా మందులు అందుబాటులోకి వచ్చాయి. ఇది వైద్యశాస్త్రంలో వచ్చిన గొప్ప పురోగతి. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కిడ్నీ మార్పిడిని ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నారు. ట్రాన్స్ప్లాంట్ చేసిన తరువాత రోగి జీవిత కాలం ‘ఇమ్యునోసప్రేషన్’ మందులు వాడాల్సి ఉంటుంది. ప్రతి నెల రూ.20వేల విలువైన మందులను తెలంగాణ ప్రభుత్వం పూర్తి ఉచితంగా అందిస్తున్నది. – డాక్టర్ శ్రీభూషణ్ రాజు, నెఫ్రాలజీ విభాగాధిపతి, నిమ్స్ హాస్పిటల్
అవయవ దానంపై గతంతో పోల్చితే ప్రజల్లో అవగాహన పెరిగింది. 2013లో ఒక డోనర్తో మొదలైన జీవన్దాన్ ప్రస్తుతం 888మంది డోనర్లు తమ అవయవాలను దానం చేశారు. కరోనాకు పూర్వం 120నుంచి 150 వరకు అవయవాల సేకరణ జరిగేది. కరోనా వల్ల 2020లో 75, ఈ సంవత్సరం ఆగస్టు వరకు 82 అవయవాలను సేకరించాం. ఇప్పటి వరకు జీవన్దాన్ ద్వారా 3వేల మందికి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించాం. ఇందులో 1400మందికి కిడ్నీలు, 830మందికి కాలేయం, 100మందికి గుండె, 70మందికి ఊపిరితిత్తులు వంటి ప్రధాన అవయవాలను మార్పిడి చేశాం. జీవన్దాన్లో కిడ్నీలకు అధిక డిమాండ్ ఉంది.
ప్రస్తుతం 4730మంది రోగులు వివిధ అవయవాల కోసం నిరీక్షణలో ఉండగా అందులో సుమారు రెండువేల మంది వరకు కేవలం కిడ్నీల కోసం నిరీక్షిస్తున్నారు. ఒక రోగి కిడ్నీ కోసం కనీసం 3సంవత్సరాలు నిరీక్షించాల్సి వస్తుంది. కారణం లైవ్ డోనర్స్ లేకపోవడం, బాధితుల సంఖ్య పెరిగిపోతుండటం. అవయవ మార్పిడి కోసం ప్రస్తుతం నగరంలోని 30 దవాఖానల్లో జీవన్దాన్ సదుపాయం ఉంది. అవయవాలు అవసరమున్న రోగులు తమ వివరాలను ఆన్లైన్ ద్వారా జీవన్దాన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ రోగి చికిత్స పొందుతున్న హాస్పిటల్ సిబ్బంది చేస్తారు. కరోనా సమయం నుంచి ఊపిరితిత్తుల మార్పిడికి కూడా డిమాండ్ పెరుగుతున్నది. – డాక్టర్ స్వర్ణలత, జీవన్దాన్ కో-ఆర్డినేటర్
కాలేయ మార్పిడి శస్త్రచికిత్స అంటే ఒకప్పుడు చాలా మందికి తెలియదు. తెలిసినా అది ఖర్చుతో కూడినది కావడంతో మధ్య తరగతి, నిరుపేద వర్గాలకు అందని ద్రాక్షగానే ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత లివర్ ట్రాన్స్ప్లాంట్ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. ఉస్మానియా దవాఖానలో లివర్ ట్రాన్స్ప్లాంట్ చికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయి. 15వరకు కాలేయమార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించాం. – డాక్టర్ బి.రమేశ్, మెడికల్ గ్యాస్ట్రో విభాగాధిపతి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్
కిడ్నీతో పోల్చితే కాలేయ మార్పిడిలో ఫెయిల్యూర్స్ చాలా తక్కువ. సంవత్సరానికి 30శాతం సిరోసిస్ బారిన పడి లివర్ ఫెయిల్యూర్కు గురవుతుంటారు. కాలేయమార్పిడి శస్త్రచికిత్సలో సక్సెస్ రేటు అధికంగా ఉంటుంది. నిమ్స్లో ఇప్పటి వరకు 16 కాలేయ మార్పిడీలు చేశాం. జీవన్దాన్ ద్వారా జరుగుతున్న ఆర్గాన్ డొనేషన్ వల్ల కాలేయ బాధితులకు పునర్జన్మ లభిస్తుంది. – డాక్టర్ బీరప్ప, సర్జికల్ గ్యాస్ట్రో విభాగాధిపతి,
ఏదైనా ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో రోగి బ్రెయిన్డెడ్కు గురైనట్లు సంబంధిత వైద్యులు ధ్రువీకరిస్తే వెంటనే ఆ సమాచారాన్ని వైద్యులు జీవన్దాన్ సంస్థకు చేరవేస్తారు. జీవన్దాన్ బృందం బ్రెయిన్డెడ్కు గురైన జీవన్మృతుడి వద్దకు చేరుకుని అతడి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులు అంగీకరిస్తే అందుకు సంబంధించిన డాక్యుమెంటరీ ప్రక్రియ పూర్తిచేసి వెంటనే అవయవ దాతకు సంబంధించిన వయస్సు, బ్లడ్గ్రూప్ వివరాలు సేకరిస్తారు.
వాటిని తమ వద్ద రిజిస్టర్ అయివున్న రెసిపియెంట్ (అవయవ దానం కోసం నమోదు చేసుకున్న రోగుల పట్టిక) డాటాలో సెర్చ్ చేస్తారు. దాతకు సరిసమాన వయస్సు, బ్లడ్గ్రూప్ కలిగిన రోగి ఎవరైనా ఉంటే వెంటనే సదరు రోగికి కావాల్సిన అవయవాన్ని సేకరిస్తారు. ఈ ప్రక్రియను అవయవాలు పనిచేయకుండా బాధపడుతూ రోగి చికిత్స పొందుతున్న ఆస్పత్రి వైద్యులు పూర్తిచేసి, సదరు వైద్యులే అవయవాన్ని సేకరించి రోగికి మార్పిడి చేస్తారు.
1400 మందికి కిడ్నీ
830 మందికి కాలేయం
100 మందికి గుండె
70 మందికి ఊపిరితిత్తులు