హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): భర్త పోయి 60 ఏండ్లు అయ్యింది. నాటి నుంచి పింఛన్ డబ్బుల కోసం ఆ మహిళ తిరగని ఆఫీసు లేదు. ఆరు దశాబ్దాలుగా కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో న్యాయ పోరాటానికి దిగిన ఆ వృద్ధురాలికి ఎట్టకేలకు లోకాయుక్తలో న్యాయం జరిగింది. ఇప్పటివరకు ఆమె రావాల్సిన పింఛన్ డబ్బులు మొత్తం ఇవ్వాలంటూ లోకాయుక్త తీర్పు ఇవ్వడంతో 60 ఏండ్ల పెన్షన్ బకాయిలు రూ.15.70 లక్షలను ట్రెజరీ అధికారులు ఆమెకు అందించారు. జీవిత చరమాంకంలో లోకాయుక్త జోక్యంతో తనకు న్యాయం జరిగిందంటూ ఆ వృద్ధురాలు ఆనందం వ్యక్తం చేశారు.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శేషగిరిరావు రోడ్లు. భవనాల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్గా పనిచేసేవారు. 1962 ఫిబ్రవరి 6న ఆయన ప్రమాదవశాత్తు చనిపోయారు. తన భర్త మరణించారని, పెన్షన్ మంజూరు చేయాలంటూ ఆయన సతీమణి కృష్ణవేణి సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా, ఏండ్లు గడిచినా స్పందన రాలేదు. దీంతో ఆమె 2021లో లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన లోకాయుక్త బాధితురాలికి నెల రోజుల్లో పెన్షన్ మంజూరు చేయాలంటూ కాకినాడ ట్రెజరీ అధికారులను ఆదేశించారు. బాధితురాలికి రావాల్సిన పెన్షన్ బకాయిలు మొత్తం చెల్లించామని ట్రెజరీ కార్యాలయం తెలిపిందని రిజిస్ట్రార్ ఆర్ వెంకటేశ్వర్రెడ్డి బుధవారం తెలిపారు.