Boggula Srinivas : ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ (Boggula Srinivas) రోడ్డు ప్రమాదంలో దర్మరణం చెందారు. ‘పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’పుస్తకంతో పాపులరైన ఆయన.. శుక్రవారం ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. లారీ ఢీకొట్టడంతో కారులో వెనక సీట్లో కూర్చున్న శ్రీనివాస్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. సమగ్ర సాహిత్య పరిశోధకుడిగా పేరొందిన ఆయన మరణ వార్త సాహితీ ప్రియులను, ఆయనతో చదువుకున్న వారిని ఎంతగానో కలచి వేస్తోంది.
నందికొట్కూర్ సమీపంలోని అల్లూరు గ్రామంలో జన్మించిన బొగ్గుల శ్రీనివాస్ కర్నూల్లోని సిల్వర్ జూబ్లీ కాలేజీ(SJGC) పూర్వ విద్యార్థి. 1995-98 మధ్య ఆయన ఆంగ్య మాధ్యమంలో బీఎస్సీ.బీజెడ్సీ(BZC) అభ్యసించారు. ఆపై ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ చదివిన శ్రీనివాస్.. బీఈడీ కూడా పూర్తి చేశారు. అనంతరం సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న శ్రీనివాస్ పలు పుస్తకాలు రాశారు. ముఖ్యంగా జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ (Ravuri Bharadhwaja) రచనలను వెలుగులోకి తెచ్చారు.
భరద్వాజపై ఆయన రాసిన వ్యాఖ్యానాలను 2012లో తెలంగాణ అధికారిక భాషా సంఘం, సాంస్కృతిక శాఖ ప్రచురించింది. ‘పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అనే పుస్తకంతో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంగా మారారు శ్రీనివాస్. 2014లో ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో తనకు పవన్ అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉందని తెలుపడంతో తెలంగాణ ప్రభుత్వం ఆయనకు రక్షణ కల్పించింది.
రచయితగా.. సమగ్రసాహిత్య పరిశోధకుడిగా కొనసాగుతున్న శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో పలువురు సంతాపం తెలుపుతున్నారు. సిల్వర్ జూబ్లీ కాలేజీలో ఆయనతో కలిసి చదువుకున్న వారు, సహచరులు అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు.