Boggula Srinivas : తెలుగు సాహిత్యంలో ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ (Boggula Srinivas) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఆయన నీళ్లలోనే ప్రాణాలు విడిచారు. అయితే.. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ సురక్షితంగా బయటకు రావడం.. అక్కడి నుంచి పరారవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మొదట రోడ్డు ప్రమాదంలో బొగ్గుల శ్రీనివాస్(49) చనిపోయారనే వార్తలు వచ్చాయి. కానీ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కారు పాలేరు రిజర్వాయర్లోకి వేగంగా దూసుకొచ్చింది. వెంటనే డ్రైవర్ బయటకు వచ్చి పరారయ్యాడు. వెనుక సీట్లోనే ఉన్న శ్రీనివాస్ బయటకు రాలేక జల సమాధి అయ్యారు. దాంతో, ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ పట్టుబడితేనే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
నందికొట్కూర్ సమీపంలోని అల్లూరు గ్రామంలో జన్మించిన బొగ్గుల శ్రీనివాస్ కర్నూల్లోని సిల్వర్ జూబ్లీ కాలేజీ(SJGC) పూర్వ విద్యార్థి. 1995-98 మధ్య ఆయన ఆంగ్య మాధ్యమంలో బీఎస్సీ.బీజెడ్సీ(BZC) అభ్యసించారు. ఆపై ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ చదివిన శ్రీనివాస్.. బీఈడీ కూడా పూర్తి చేశారు. అనంతరం సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న శ్రీనివాస్ పలు పుస్తకాలు రాశారు. ముఖ్యంగా జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ (Ravuri Bharadhwaja) రచనలను వెలుగులోకి తెచ్చారు.
భరద్వాజపై ఆయన రాసిన వ్యాఖ్యానాలను 2012లో తెలంగాణ అధికారిక భాషా సంఘం, సాంస్కృతిక శాఖ ప్రచురించింది. ‘పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అనే పుస్తకంతో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంగా మారారు శ్రీనివాస్. 2014లో ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో తనకు పవన్ అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉందని తెలుపడంతో తెలంగాణ ప్రభుత్వం ఆయనకు రక్షణ కల్పించింది.
రచయితగా.. సమగ్రసాహిత్య పరిశోధకుడిగా కొనసాగుతున్న శ్రీనివాస్ మరణించడంతో పలువురు సంతాపం తెలుపుతున్నారు. సిల్వర్ జూబ్లీ కాలేజీలో ఆయనతో కలిసి చదువుకున్న వారు, సహచరులు అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు.