ఖైరతాబాద్, మే 28 : ఓటరు తనకు ఏ అభ్యర్థి నచ్చకపోతే నోటాకు ఓటు వేస్తారని, ఒక వేళ నోటాకు అధిక ఓట్లు వస్తే వెంటనే ఆ నియోజకవర్గంలో రీపోల్ చేయాలని వక్తలు అభిప్రాయపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ల్క్లబ్లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి అధ్యక్షతన పంచాయతీ ఎన్నికల్లో నోటా అమలుపై జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి హాజరై ప్రసంగించారు. నోటా అమలు తర్వాత జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నోటాకు సుమారు 1.5శాతం ఓట్లు వచ్చాయని, నోటాకు అధిక ఓట్లు వచ్చినా రీ పోల్ జరిగే వెసలుబాటు లేదన్నారు. ఈ విషయంపై సుప్రీం కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నదని, పలు సందర్భాల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి రాష్ర్టాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటాను ఓ కల్పిత అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆర్డర్ ఇచ్చారని గుర్తు చేశారు. దీంతో ఇతర అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రిపోల్ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ రీ పోల్లో మొదట బరిలో ఉన్న అభ్యర్థులెవరూ పోటీ చేయడానికి వీలు లేదన్నారు.
నోటాను బలపర్చడానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చేస్తున్న కృషిని అభినందించారు. పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ వచ్చే రెండు మూడు నెలల్లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నదని, 2019 లో జరిగిన ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో సుమారు 16 శాతం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు తెలిపారు. ఇందులో అధికంగా వేలం పాటలో గెలిచిన అభ్యర్థులు సర్పంచ్లుగా ఎన్నికయ్యారని, ఇక్కడ గ్రామ కమిటీలు, కుల సంఘాలు రాజ్యాంగేతర శక్తులుగా పనిచేస్తూ సర్పంచ్ పదవులను వేలం వేస్తున్నారని తెలిపారు. ఏకగ్రీవ ఎన్నికల వల్ల సామాన్యులు ఓటు హక్కును కోల్పోతారని, ఈ పరిస్థితి మారాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు బి.మన్మధ రెడ్డి, విశ్రాంత డీజీపీ గోపాల్ రెడ్డి, లోక్సత్తా నాయకులు బండారు రామ్మోహన్ రావు, ఎన్నికల నిఘా వేదిక ప్రతినిధి వీవీ రావు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉపాధ్యక్షుడు గోపాల్ రెడ్డి, సహాయ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.