సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ)/మియాపూర్ : అవినీతి అక్రమాలు, మహిళలతో అసభ్య ప్రవర్తన, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసులపై పోలీసు బాస్లు సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. హైదరాబాద్లో పంజాగుట్ట ఠాణాలో 85 మంది ఒకేసారి బదిలీ కావడం, ఆ ఠాణా మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును అరెస్ట్ చేసిన విషయం మరువకముందే సైబరాబాద్లో మరో ఇన్స్పెక్టర్పై వేటు పడింది. మియాపూర్ ఇన్స్పెక్టర్ ప్రేమ్కుమార్, స్టేషన్కు వచ్చిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి మంగళవారం సస్పెండ్ చేశారు. ట్రై కమిషనరేట్లలోని ఠాణాలలో కొందరు అధికారుల అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుండడంతో ఆయా ఠాణాలు వార్తలోకి ఎక్కుతున్నాయి. అవినీతి, అక్రమాలకు అడ్డాలుగా మారిన వాటిని చక్కబెట్టేందుకు పోలీస్ కమిషనర్లు శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంత మందిపై బదిలీ వేటు వేస్తున్న ఉన్నతాధికారులు, తమకు ఫిర్యాదులు వచ్చే వాటిపై అంతర్గతంగా విచారణ జరుపుతూ సస్పెండ్ చేస్తున్నారు.
గోపాలపురం పోలీస్స్టేషన్లో ఒక సినీ నిర్మాత హత్య కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై గోపాలపురం ఏసీపీ సుధీర్, ఇన్స్పెక్టర్ మురళీధర్, ఎస్సై దీక్షిత్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకున్నారు.
పంజాగుట్టలో ఇన్స్పెక్టర్ దుర్గారావు, ఆయనకు సహకరించిన బోధన్ మాజీ ఇన్స్పెక్టర్ను అరెస్ట్ చేసి, పంజాగుట్ట ఠాణా సిబ్బందిపై సమూల మార్పులు చేశారు..
కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సివిల్ తగదాలో దూరి, మహిళను వేధింపులకు గురి చేశారనే ఆరోపణలపై సైబరాబాద్ సీపీ సస్పెండ్ చేశారు.
భార్య, భర్త పంచాయితీలో తలదూర్చి బాధితుడిని చితకబాదడంతో కేపీహెచ్ఎబీ సీఐ వెంకటేశ్ను సీపీ సస్పెండ్ చేశారు.
సివిల్ తగాదాలో తలదూర్చిన పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ సతీశ్ను రాచకొండ సీపీ సుధీర్బాబు సస్పెండ్ చేశారు.