సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : జలమండలి ఉన్నతాధికారులతో ఎండీ సుదర్శన్రెడ్డి మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కాన్ఫరెన్స్లో డివిజన్ల వారీగా ట్యాంకర్ల బుకింగ్స్, డెలివరీ, పెండెన్సీ, పర్యవేక్షణ, అదనపు ట్యాంకర్లు, రాత్రి వేళల్లో సరఫరా చేసే ట్రిప్పులు, నీటి సరఫరా, అదనపు జలాల కేటాయింపు తదితర అంశాలపై ఎండీ సమీక్షించారు. డివిజన్ల వారీగా వివరాల్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ట్యాంకర్ల ట్రిప్పులు, నీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలపై ఆరా తీశారు. నీటి సరఫరాలో లోప్రెషర్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని సూచించారు. ట్యాంకర్ డెలివరీలో ఆలస్యం లేకుండా చూడాలని, ఒకవేళ ఆలస్యమైతే వినియోగదారులకు సందేశం పంపించాలన్నారు. అంతకు ముందు ఎండీ సుదర్శన్ రెడ్డి నారాయణగూడ, చిలకలగూడలో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్లను పరిశీలించారు. లాగ్బుక్స్, నీటి సరఫరా వివరాల్ని అడిగి తెలుసుకున్నారు.