ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 18 : రాష్ట్రంలో సాధారణ ప్రజలను గమ్యస్థానాలకు చేరవేసే టీఎస్ఆర్టీసీ.. వైద్యసేవలను సైతం అందించేందుకు నడుం బిగించింది. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో తక్కువ ధరలతో నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. మరిన్ని ఆధునిక సదుపాయాలను సమకూర్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఔట్పేషెంట్, ఇన్పేషెంట్, డయోగ్నస్టిక్స్, ఫిజియోథెరపీ తదితర అన్ని రకాల సేవలను అందజేస్తున్నారు. ఆసుపత్రికి అనుబంధంగా నర్సింగ్ కళాశాల, వొకేషనల్ జూనియర్ కళాశాలలను ప్రారంభించారు.
ఆస్పత్రి భవనం విస్తరణకు కార్యాచరణ
ఇప్పటికే ఉన్న ఆర్టీసీ ఆస్పత్రి భవనం సరిపోని పరిస్థితిలో దానిని సైతం విస్తరించేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఎమర్జెన్సీ చిన్నగా అయిపోయి, సరిపోని పరిస్థితుల్లో దానిని విస్తరించేందుకు పనులు ప్రారంభించారు. పైన మరో అంతస్తు నిర్మించి, కింద ఉన్న కార్యాలయాలను పైకి మార్చి, ఎమర్జెన్సీని విశాలంగా మార్చనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు సైతం ప్రారంభమయ్యాయి. సిటీ స్కాన్, ఎంఆర్ఐ తదితర పరీక్షలను కూడా ఇక్కడే నిర్వహించేందుకు అవసరమైన యంత్రసామాగ్రి కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారు.
ఆర్టీసీ ఆస్పత్రి దశ మారింది..!
ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకు తార్నాకలో 200 పడకలతో ఆర్టీసీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. అందులో కేవలం ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు మాత్రమే చికిత్స అందించేవారు. సరైన సదుపాయాలు లేకపోవడంతో మెరుగైన సేవల కోసం ఇతర ఆస్పత్రులకు వారిని పంపించేవారు. దీనికోసం నెలకు దాదాపు రూ.2 కోట్ల మేర ఆయా ఆస్పత్రులకు చెల్లించాల్సి వచ్చేది. ఈ క్రమంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన అనంతరం ఆర్టీసీ ఆస్పత్రి దశ పూర్తిగా మారిపోయింది. అన్ని రకాల వైద్య సేవలను ఇక్కడే అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో ఇతర ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులు సగానికి పైగా తగ్గిపోయి, ఆర్టీసీపై కొంత భారం తగ్గింది.
నిమ్స్ తరహాలో వైద్య సేవలు
ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న అన్ని వైద్య సేవలను అతి తక్కువ ధరకే సాధారణ ప్రజానీకానికి సైతం అందిస్తున్నారు. సాధారణంగా ఆయా వైద్య సేవలకు నిమ్స్ ఆస్పత్రిలో చార్జీ చేసే మొత్తాన్నీ ఇక్కడ సైతం చార్జీ చేయనున్నారు. నిమ్స్ ఆస్పత్రిలో లేని సేవలకు సీజీహెచ్ఎస్ (సెంట్రల్ గవర్న్మెంట్ హెల్త్ స్కీమ్)లో బేసిక్ టారిఫ్ వర్తిస్తుంది. సాధారణంగా అతి తక్కువ ధరకు నాణ్యమైన వైద్యసేవలు నిమ్స్ ఆస్పత్రిలో లభిస్తాయని ప్రజలు భావిస్తారు. అదే చార్జీలతో ఆర్టీసీ ఆస్పత్రిలో సైతం నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డయాలసిస్ సైతం ఇక్కడే
వ్యక్తి కిడ్నీలు సరిగా పనిచేయకపోతే చేసే డయాలసిస్ను సైతం ఇక్కడే చేస్తున్నారు. ఇటీవల నాలుగు మిషన్లతో డయాలసిస్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన అధికారులు ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రమే ఈ సేవలను అందిస్తున్నారు. మరో రెండు మిషన్ల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపి, అవి వస్తే సాధారణ ప్రజానీకానికి సైతం డయాలసిస్ సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
జనరిక్ మందులపై 50 శాతం డిస్కౌంట్
సాధారణంగా ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెడిసిన్ను ఉచితంగా అందజేస్తారు. కానీ ఆ మెడిసిన్ను సైతం సాధారణ ప్రజలకు తక్కువ ధరకు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈ మెడికల్ షాప్లను ఆర్టీసీ ఆస్పత్రితో పాటు సీబీఎస్, కాచిగూడ రైల్వేస్టేషన్ ఎదురుగా నెలకొల్పారు. బ్రాండెడ్ జనరిక్ మందులపై 50 శాతం వరకు డిస్కౌంట్, ఇతర మందులపై 15 శాతం డిస్కౌంట్ అందిస్తూ ప్రజలకు ఔషధాలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు నడుం బిగించారు.
సజ్జనార్ ఆలోచనతో కొత్తరూపు
టీఎస్ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆర్టీసీ ఆస్పత్రి ఆధునీకరణపై పూర్తిగా దృష్టిసారించారు. ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుబాటులోకి అన్ని రకాల వైద్యసేవలు తీసుకువచ్చేందుకు నడుంబిగించారు. ఆధునిక హంగులతో ఐసీయూ, ఎమర్జెన్సీ, డయాలసిస్, ఫిజియో థెరపీ విభాగాలను, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. మరో రెండు నెలల్లో ఈ ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి రానున్నది. ఇది అందుబాటులోకి వస్తే సూపర్ స్పెషాలిటీ సర్జరీలు సైతం ఇక్కడే నిర్వహించనున్నారు.
అందుబాటులో అన్ని స్పెషాలిటీ, ఔట్పేషెంట్ సేవలు
ఇప్పటికే దాదాపు స్పెషాలిటీల ఔట్పేషెంట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. మిగిలిన వాటిని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆస్పత్రి అధికారులు నిమ్స్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, ఆప్థమాలజీ, ఈఎన్టీ, పల్మనాలజీ, గైనకాలజీ, డెర్మటాలజీ, కార్డియాలజీ, పీడియాట్రిక్స్, డెంటల్ తదితర వైద్యులు ఆస్పత్రిలోనే అందుబాటులో ఉండగా, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ తదితర విభాగాల వైద్యులను కన్సల్టెంట్ ప్రాతిపదికన అందుబాటులో ఉంచారు. నెఫ్రాలజీతో సహా పలు ఇతర స్పెషాలిటీ వైద్యులను నిమ్స్ ద్వారా అందుబాటులోకి తీసువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవలం రూ.450కే పైన పేర్కొన్న ఈ సూపర్ స్పెషాలిటీ వైద్యులు సాధారణ ప్రజలకు ఓపీ సేవలను అందిస్తున్నారు.
తక్కువ ధరకే వైద్య సేవలు
సాధారణ ప్రజలకు అత్యుత్తమమైన వైద్య సేవలను తక్కువ ధరకే అందించేందుకు కట్టుబడి ఉన్నాం. ఒకవైపు ఆర్టీసీ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వైద్య సేవలను అందిస్తున్నాం. కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ల సహకారంతో మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.
– డాక్టర్ ఎన్. శైలజా మూర్తి, సూపరింటెండెంట్, ఆర్టీసీ ఆస్పత్రి