రంగారెడ్డి, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ)/ వనస్థలిపురం : ఇప్పటి వరకు బోగస్ కార్డులతో రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించడాన్ని చూశాం. అలాగే.. బినామీ డీలర్లతో బియ్యం పంపిణీలో జరుగుతున్న మోసాలను విన్నాం. కానీ.. పారదర్శకతకు నిదర్శనంగా చెప్పుకుంటున్న ఈ-పాస్ యంత్రాలతోనే డీలర్లు జిల్లాలో నడిపిస్తు నయా దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎక్కడి నుంచి అయినా సరుకులు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం కల్పించిన ‘పోర్టబిలిటీ’ విధానమే ఈ అక్రమాలకు ఊతమిస్తున్నది. కొద్దిరోజుల కిందట ఒక దుకాణానికి సంబంధించిన ఈ పాస్ యంత్రం మరో దుకాణంలో దర్శనమివ్వడంతో ఆరా తీసిన సివిల్ సప్లయ్ అధికారులకు డీలర్ల నయా దందా బయటపడింది. దీంతో ఈ తరహాలో జిల్లాలో ఎక్కడెక్కడ దందా నడుస్తుందన్న దానిపై అధికారులు ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో మొత్తం 5.58లక్షల రేషన్ కార్డులకు ప్రతి నెలా 11,562.725 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. అయితే ఇందులో 30 శాతం బియ్యం వివిధ రూపాల్లో పక్కదారి పడుతున్నట్లు తెలుస్తున్నది. రేషన్ దుకాణాల్లో సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడడం వల్లనే బియ్యం దందాకు అడ్డుకట్ట పడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వనస్థలిపురంలోని ఓ రేషన్ దుకాణంలో బియ్యం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కొద్దిరోజుల కిందట సివిల్ సప్లయ్ అధికారులకు అందిన సమాచారం మేరకు అధికారులు అక్కడకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. మాడ్గుల మండలంలోని ఓ రేషన్ దుకాణానికి సంబంధించిన ఈ-పాస్ యంత్రం ఉండడాన్ని అధికారులు గుర్తించారు. వనస్థలిపురంతోపాటు మాడ్గుల మండలంలోని రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న సరుకులను, పంపిణీ చేసిన బియ్యం లెక్కలను అధికారులు పరిశీలించారు. లెక్కల్లో ఎక్కడా తేడా లేదని అధికారులు చెబుతున్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని అంటున్నారు. అయితే మాడ్గుల మండలంలోని దుకాణానికి సంబంధించిన మిషన్ వనస్థలిపురంలో ప్రత్యక్షం కావడం మాత్రం మిస్టరీగా మారింది. చార్జింగ్ కోసమే మిషన్ను అక్కడ పెట్టినట్లు మాడ్గుల మండల డీలర్ చెప్పి తాత్కాలికంగా తప్పించుకున్నప్పటికీ.. ఈ ఘటన రేషన్ డీలర్ల నయా దందాను మాత్రం తేటతెల్లం చేసింది. జిల్లాలో జరుగుతున్న ఈ తరహా అక్రమాలపై లోతుగా విశ్లేషించే పనిలో సివిల్ సప్లయ్ అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తున్నది.
రేషన్ బియ్యం పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ-పాస్ యంత్రాన్ని అమలులోకి తెచ్చి బయోమెట్రిక్ విధానంలో బియ్యాన్ని కార్డుదారులకు అందజేస్తున్నారు. అలాగే.. ఎక్కడి నుంచి అయినా రేషన్ బియ్యాన్ని తీసుకునేలా ప్రభుత్వం ‘పోర్టబిలిటీ’ విధానాన్ని తెచ్చింది. రేషన్ బియ్యాన్ని పూర్తి ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం బియ్యం పంపిణీని చేసినందుకు డీలర్లకు క్వింటాలుకు రూ.140 లెక్కన చెల్లిస్తున్నది. ఉద్యోగ, ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు రంగారెడ్డి జిల్లాలో అధికంగా ఉండడంతో జిల్లాలో పోర్టబిలిటీ విధానం సక్సెస్ఫుల్గా సాగుతున్నది. ఇదే డీలర్లకు వరంలా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ తీసుకునే వారు తక్కువగా ఉండడంతో చాలా మంది డీలర్లు పట్టణ ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో అక్కడి ఈ-పాస్ యంత్రాలను ఉంచి బియ్యం పంపిణీని జరుపుతున్నారు. దీనివల్ల ప్రభుత్వం నుంచి కమీషన్ రూపంలో వస్తున్న డబ్బులను అక్రమంగా పొందుతున్నారు. ఇది మొదటి విడత జరిగే వ్యవహారం. ఇక రెండోది.. కార్డుదారుల వేలి ముద్రలు వేశాక.. తూకంలో బియ్యం వేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి డీలర్లు డబ్బులు చెల్లిస్తున్నారు. ఆ బియ్యాన్ని దొడ్డిదారిన విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ లెక్కన ఒక్కో క్వింటాలుపై రూ.400-రూ.500 వరకు డీలర్లు అక్రమంగా సంపాదిస్తున్నట్లు తెలిసింది. ఈ-పాస్ యంత్రం మాటున జిల్లాలో రూ.కోట్లలో అక్రమ దందా సాగుతున్నట్లు తెలుస్తున్నది. ఒక దుకాణంలోని బియ్యాన్ని మరో దుకాణానికి సర్దుబాటు చేస్తూ అక్రమాలను కప్పిపుచ్చుతుండగా.. సివిల్ సప్లయ్ అధికారుల నిరంతర పర్యవేక్షణ లేకనే జిల్లాలో నయా దందా సాగుతున్నదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
జిల్లాలో అంత్యోదయ, ఆహార భద్రత, అన్నపూర్ణ ఆహార భద్రత కార్డులు మొత్తం 5,58,438 వరకు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం నెలనెలా 11,562.725మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జిల్లాలోని 932 చౌక ధరల దుకాణాలకు కేటాయిస్తున్నది. ఇందుకుగాను ప్రభుత్వం కిలో బియ్యానికి రూ.39.35పై. వరకు ఖర్చు చేస్తున్నది. పేదల కోసం పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమార్కుల జేబులు నింపుతున్నది. ప్రభుత్వం కేటాయిస్తున్న బియ్యంలో సుమారు 30శాతం బియ్యం పక్కదారి పడుతున్నట్లు తెలుస్తున్నది. పట్టణాలు, గ్రామాల్లో దళారులను పెట్టుకుని తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ కొందరు వ్యాపారులు దందా సాగిస్తున్నారు. కొన్నిచోట్ల రేషన్ డీలర్లే నేరుగా కార్డుదారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని మిల్లుల్లో పాలిష్ చేయించి సన్నరకం బియ్యంలో కలుపుతుండగా.. కొందరు మిల్లర్లు సీఎంఆర్ కింద తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన రేషన్ బియ్యం చాలా వరకు సరిహద్దులు దాటుతున్నది. ఔటర్ మీదుగా నేరుగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. రేషన్ బియ్యం పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈకేవైసీని అమలు చేస్తున్నది. అలాగే.. బినామీ డీలర్లకు లాగిన్ సౌకర్యాన్ని సైతం తొలగించింది. అడపాదడపగా 6ఏ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ జిల్లాలో బియ్యం అక్రమ దందాకు మాత్రం తెరపడడం లేదు.
వనస్థలిపురం రేషన్ దుకాణంలో మాడ్గుల మండలానికి సంబంధించిన ఈ-పాస్ యంత్రం ఉండడంపై విచారణ జరుపుతున్నాం. రెండు చోట్ల దుకాణాల్లో ఫిజికల్ వెరిఫికేషన్ చేశాం. స్టాక్, బియ్యం పంపిణీలో వ్యత్యాసం లేదని గుర్తించాం. ఈ-పాస్ యంత్రాలతో డీలర్లు చేస్తున్న కొత్త తరహా మోసాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం.