Greater Hyderabad | సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. నగరం నలువైపులా ఎటుచూసినా గృహ నిర్మాణ, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్నాయి. శివారు ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న కొత్త విద్యుత్ కనెక్షన్ల సంఖ్య అందుకు నిదర్శనం. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో మొత్తం 21 సర్కిళ్లు ఉండగా, అందులో 9 సర్కిళ్లు గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. శివారు ప్రాంతాల్లోని సర్కిళ్లు.. హబ్సిగూడ, సరూర్నగర్, మేడ్చల్, రాజేంద్రనగర్, సైబర్ సిటీ సర్కిళ్లలో 8.70లక్షల నుంచి 6.70లక్షల దాకా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.
మిగతా నాలుగు సర్కిళ్లలో కేవలం 4 లక్షల వరకే ఉన్నాయి. ఉదాహరణకు హబ్సిగూడ సర్కిల్ పరిధిలో 2023-24 మధ్య ఒకే ఏడాదిలో 50 లక్షల కొత్త కనెక్షన్లు వచ్చాయి. దీంతో డిస్కం పరిధిలోనే గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం అత్యంత కీలకంగా మారింది. తక్కువ సంఖ్యలో వ్యవసాయ కనెక్షన్లు ఉండగా, ఎక్కువ సంఖ్యలో ఆదాయం వచ్చే పారిశ్రామిక వాడలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలు, ఐటీ కారిడార్ వంటివి ఉన్నాయి. దీంతో టీఎస్ఎస్పీడీసీఎల్ సంస్థ విద్యుత్ బిల్లుల ద్వారా వచ్చే ఆదాయంలో సింహా భాగం గ్రేటర్ పరిధి నుంచే వస్తోంది.
గత కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ రంగంపై ముందుచూపుతో వ్యవహరించింది. ఎన్ని కొత్త విద్యుత్ కనెక్షన్లు వస్తే అంత డిమాం డు పెరుగుతూనే ఉంటుందని గుర్తించి, దానికి అనుగుణంగానే విద్యుత్ సరఫరా వ్యవస్థల నెట్వర్క్ను ఏర్పాటు చేసింది. దీంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా లైన్లు, సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరమే రావడం లేదు. రోజు వారి డిమాండుకు అనుగుణంగా అంతరాయం లేని విద్యుత్ను అందించేందుకు విద్యుత్ శాఖ పనిచేస్తోంది. గత ప్రభుత్వం ముందుచూపుతో గ్రేటర్ చుట్టూ పవర్ గ్రిడ్ సర్కిల్ ఏర్పాటు చేయడంతో ఒక లైన్లో విద్యుత్ అంతరాయం తలెత్తితే మరో లైన్ నుంచి వెంటనే పొందే అవకాశం ఉంది.
గతేడాది మేలో ఉండే విద్యుత్ డిమాండు ఈసారి మార్చిలోనే నమోదైంది. 2023లో మే 19న అత్యధికంగా 79.33 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైతే, ఈ ఏడాది వేసవిలో ఏప్రిల్ 4న అత్యధికంగా రికార్డు స్థాయిలో 83.84 మిలియన్ యూని ట్లు నమోదైంది. వేసవి కార్యాచరణలో భాగం గా ఐటీ కారిడార్ పరిధిలోకి వచ్చే సైబర్ సిటీ సర్కిల్లో మొత్తం 5 చోట్ల పవర్ ట్రాన్స్ఫార్మర్స్ను ఏర్పాటు చేశామని సర్కిల్ ఎస్ఈ వెంకన్న తెలిపారు. అలాగే హబ్సిగూడ, సరూర్నగర్ సర్కిళ్లలోనూ పెరుగుతున్న విద్యుత్ డిమాండును పరిశీలించి పీటీఆర్, డీటీఆర్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కోర్ సిటీలోని హైదరాబాద్ సెంట్రల్, సికింద్రాబాద్, బంజారాహిల్స్ సర్కిళ్లలో కొత్త కనెక్షన్లు 2 నుంచి 3 శాతం మేరకే ఉంటున్నాయని అధికారులు తెలిపారు.