సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : మహిళలపై జరుగుతున్న నేరాలపై ఫిర్యాదులను స్వీకరించి.. వాటికి త్వరితగతిన పరిష్కారం చూపే లక్ష్యంతో గురువారం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఆధ్వర్యంలో మహిళా జనసున్వాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్రెడ్డి, ఏసీబీ డీజీ చారు సిన్హా, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు, హైదరాబాద్ అదనపు సీపీ(క్రైమ్స్) శ్రీనివాస్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరి, తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి జిల్లాకు చెందిన 30 ఫిర్యాదులు అందాయి. అలాగే ఐదుగురు మహిళలు నేరుగా వచ్చి ఫిర్యాదులు చేశారు. ఇందులో గృహహింస, వేధింపులు, విడిచిపెట్టడం, సైబర్నేరాల వంటి సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.
వీటిపై సమీక్ష నిర్వహించిన చైర్పర్సన్ విజయ రహత్కర్ బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా మార్చి 8 నుం చి 13 వరకు జాతీయ మహిళా కమిషన్ జనసున్వాయి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళలు తమ సమస్యలను నేరుగా తెలియజేసుకునే వేదికగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు. ఎన్సీఆర్బీ 2023 గణంకాల ప్రకారం మహిళలపై నేరాలు పెరుగుతున్న పరిస్థితి, వాటిపై వేగంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం, ఆయా విభాగాల మధ్య సమన్వయం మె రుగుపరచడం, పోష్ చట్టం, గృహహింస నిరోధ క చట్టం అమలు బలోపేతం చేయడం, మహిళలపై జరుగుతున్న సైబర్నేరాలను నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చ ర్చించారు. మల్కాజిగిరి కమిషనరేట్, జిల్లా పరిపాలన విభాగం మహిళల సమస్యలను పరిష్కరించడంలో చేస్తున్న కృషిని చైర్పర్సన్ అభినందించారు. మహిళల భద్రత, గౌరవం, న్యాయానికి సులభంగా చేరుకునే అవకాశాలను కల్పించేందు కు కట్టుబడి ఉన్నామని ఆమె వెల్లడించారు. కమిషనరేట్కు సంబంధించిన పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.