హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లోని స్టార్టప్ కంపెనీ మ్యాచ్ డే ఏఐకి నాస్కామ్ గేమ్చేంజర్ అవార్డు దక్కింది. 2021 ఎడిషన్కు సంబంధించి అత్యుత్తమ పనితీరును కనబర్చిన స్టార్టప్గా మ్యాచ్ డే ఏఐ గుర్తింపు పొందింది.
ఆటల విభాగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి ఆటోమెటెడ్ డేటా కలెక్షన్ అండ్ వీడియో ట్యాగింగ్ చేయడంతో మ్యాచ్ డే అద్భుతమైన పనితీరును కనబర్చడంతో దానిని ఎంపిక చేశారని త్రిబుల్ ఐటీ-సీఐఈ ప్రతినిధి తెలిపారు. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉన్న స్టార్టప్లకు ప్రోత్సాహాన్నివ్వడంలో నాస్కామ్ విశేషంగా కృషి చేస్తోంది. ఐటీ, ఐటీఈఎస్ రంగంలోని పలు ప్రైవేటు కంపెనీలు స్టార్టప్లకు అండగా నిలుస్తూ, వాటి సేవలను సద్వినియోగం చేసుకుంటున్నాయని తెలిపారు.