సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : నేషనల్ రియల్ ఎస్టేట్ డెవపల్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో తెలంగాణ) ఆధ్వర్యంలో హైటెక్స్లో ఏర్పాటైన మూడు రోజుల ప్రాపర్టీ షోను శుక్రవారం ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ భానుప్రసాద్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ప్రారంభించారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నరెడ్కో 12వ ప్రాపర్టీ షో శుక్రవారం, శని, ఆదివారం రోజులలో నిర్వహిస్తుండగా, 100కు పైగా బిల్డర్లు, డెవలపర్లు, ఆర్థిక సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. తెలంగాణ ప్రభుత్వం డెవలపర్లు, బిల్డర్లకు అన్ని విధాలా సహకారం అందిస్తున్నదని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. మెగా నిర్మాణాల దరఖాస్తులు, అనుమతుల ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నామని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ తెలిపారు. ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా వృద్ధిని సాధిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో నరెడ్కో అధ్యక్షుడు బి. సునీల్ చంద్రారెడ్డి, నరెడ్కో ఇండియా చైర్మన్ అడ్వైజర్ బోర్డు గౌతం చటర్జీ ,నరెడ్కో ఇండియా అధ్యక్షుడు రాజన్, నరెడ్కో తెలంగాణ సెక్రటరీ జనరల్ విజయ సాయి, నరెడ్కో తెలంగాణ ట్రెజరర్ కపిల్ ప్రసాద్ దామెర, నరెడ్కో తెలంగాణ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కె. శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.