ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 3: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా వ్యాస రచన పోటీలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్వీ నాయకుడు కోదాటి నాగేందర్ రావు తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగేందర్ రావు మాట్లాడుతూ ‘అప్పుడు ఎట్లుండే తెలంగాణ..? ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ..?’ అనే అంశంపై ఈ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఓయూ, నిజాం కళాశాల, సికింద్రాబాద్ పీజీ కళాశాల, సైఫాబాద్ పీజీ కళాశాలల విద్యార్థులతో పాటు అనుబంధ కళాశాలల విద్యార్థులు సైతం పాల్గొనవచ్చని చెప్పారు. పోటీలను ఈ నెల 14వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్, నాయకులు జంగయ్య, బాలెంల అవినాశ్, రామకృష్ణ, మిథున్, మధు, శ్రీను నాయక్, పవన్, సాయి, నిఖిల్, వంశీ, అజయ్, శ్రీరామ్ పాల్గొన్నారు.