హైదరాబాద్ : సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన నాగరాజు హత్య కేసులో ఇద్దరి ప్రమేయం మాత్రమే ఉన్నట్లు పోలీసులు తేల్చారు. మొబిన్తో పాటు అతని బావ కలిసి నాగరాజును హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇద్దరు నిందితులను ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. పలు కోణాల్లో విచారించి కీలక విషయాలను రాబట్టారు.
అయితే తన చెల్లి ఆశ్రిన్ను వివాహమాడిన నాగరాజును హత్య చేయాలని మొబిన్ ప్లాన్ చేశాడు. దీంతో తన జీమెయిల్కు పాస్వర్డ్గా తన మొబైల్ నంబర్ను పెట్టుకున్న మొబిన్.. నాగరాజు కూడా మొబైల్ నంబరే పెట్టుకుని ఉండొచ్చని ఊహించాడు. దీంతో నాగరాజు మొబైల్ నంబర్తో అతని జీమెయిల్ను లాగిన్ చేయడంలో సఫలమయ్యాడు. ఆ తర్వాత నాగరాజు జీమెయిల్ను లాగిన్ చేసి.. ఫైండ్ మై డివైజ్ యాప్ సహాయంతో అతని కదలికలను మొబిన్ తెలుసుకున్నాడు.
ఇక నాగరాజు కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ఈ నెల 4వ తేదీన సరూర్నగర్లో దారుణంగా హత్య చేశారు. అయితే ఈ కేసులో మొబిన్, అహ్మద్ పాత్ర మాత్రమే ఉందని, ఇతరుల ప్రమేయం లేదని పోలీసులు తేల్చారు. కస్టడీ ముగియడంతో ఎల్బీనగర్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇద్దరు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.