బంజారాహిల్స్, ఏప్రిల్ 19 : సెలవు రోజున స్పెషల్ ఐటమ్స్ రుచి చూద్దామని ఆన్లైన్లో మటన్ కీమా ఆర్డర్ చేసిన పోలీసు అధికారికి చేదు అనుభవం ఎదురైంది. పార్సిల్లో కుళ్లిన మాంసంతో తయారు చేసిన వంటకాలు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే… జూబ్లీహిల్స్ రోడ్ నం.46లోని తెలుగుమీడియం రెస్టారెంట్లో ఆన్లైన్ ద్వారా అదనపు డీసీపీ ముత్యంరెడ్డి మటన్ కీమాతో పాటు కొన్ని వస్తువులు ఆర్డర్ చేశారు.
పార్శిల్ తెరిచి చూడగా, మటన్ కీమా కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు. దీంతో షాక్కు గురైన ఆ అధికారి వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే హోటల్కు చేరుకొని ఆహార పదార్థాలను పరిశీలించారు. కుళ్లిన కీమాతో సహా మిగతా అన్ని ఐటమ్స్ను స్వాధీనం చేసుకొని శాంపిల్స్ సేకరించారు. ఈ శాంపిల్స్ను ఫుడ్ సేఫ్టీ అధికారులకు పంపించి పరీక్షలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని చెప్పారు.