సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): పిల్లల్లో కరోనా ప్రభావం తక్కువ. 80-90 శాతం మందిలో అసలు వైరస్ వచ్చినట్టు కూడా తెలియదు. కేవలం ఒక్కశాతం మందిలోనే నిమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయి. వైరస్ వచ్చిపోయిన నెల తర్వాత మల్టీ ఇన్ఫ్రమెట్రి సిస్టమ్ డిజార్డర్ (ఎంఐఎస్-సీ) ప్రభావం పిల్లల్లో అధికంగా కనిపిస్తుంది. ఎంఐఎస్-సీ వల్ల కరోనా వచ్చిపోయిన పిల్లల్లో ప్రధాన అవయవాలు దెబ్బతింటున్నాయని అపోలో క్రెడల్ వైద్యనిపుణుడు డాక్టర్ సీ సురేశ్కుమార్ తెలిపారు. కరోనా ఫస్ట్వేవ్లో కూడా కరోనాతో కాకుండా వైరస్ వచ్చిపోయిన తర్వాత పిల్లలు ఎంఐఎస్ ఇన్ఫెక్షన్కు ఎక్కువగా గురయ్యారని, రెండోదశలో కూడా అదే జరుగుతున్నదని పేర్కొన్నారు. మూడోదశలో కొవిడ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపితే.. వైరస్ కంటే కూడా ఎంఐఎస్ డిజార్డర్ సమస్యలే అధికంగా ఉండే అవకాశాలున్నట్టు వెల్లడించారు. దీనిని సకాలంలో గుర్తించి సరైన చికిత్స అందిస్తే 98 శాతం రికవరీ సాధ్యమని తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలున్న పిల్లల్లో ఈ రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు.
పిల్లల్లో కరోనా వైరస్ కంటే దాని తర్వాత వచ్చే రియాక్షన్స్, ఇన్ఫెక్షన్స్ ప్రభావమే ఎక్కువ. హార్ట్, లివర్, కిడ్నీ సమస్యలతోపాటు ప్రిమెచ్యురిటీ వంటి పిల్లల్లో అధిక సమస్యలు వస్తాయి. కరోనా ఫస్ట్వేవ్, సెకండ్ వేవ్లను పరిశీలిస్తే కరోనా నుంచి పిల్లలు మూడునాలుగు రోజుల్లోనే కోలుకుంటున్నారు. 80-90 శాతం మంది పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. దీనివల్ల పిల్లలకు వైరస్ వచ్చిన విషయం తల్లిదండ్రులకు తెలియదు. వైరస్ వచ్చిపోయిన తర్వాతే పిల్లలు ఎక్కువగా హైపర్ ఇన్ఫ్రమెట్రీ సిండ్రోమ్స్ వంటి రియాక్షన్స్కు గురవుతున్నారు. దీనిని సకాలంలో గుర్తించకపోతే హార్ట్, లంగ్స్పై వైరస్ ప్రభావం పడి మరణాలు సంభవించే అవకాశం ఉన్నది. అందుకని పిల్లల్లో మూడు నుంచి ఐదు రోజులైనా జ్వరం, వాంతులు, విరేచనాలు, ఆయసం వంటివి తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మెడికల్ టెస్టులు చేయించి చికిత్స మొదలుపెట్టాలి. పిల్లల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు.