సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీ) కార్యాలయాన్ని నానక్రాంగూడకు తరిలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తార్నాకలోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కార్యాలయంలో కొనసాగుతున్న కార్యాలయాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం మార్చాలని నిర్ణయించారు.
ఈ మేరకు మంగళవారం మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, హెచ్ఎండీఏ జోనల్ కమిషనర్ ఆమ్రపాలి నానక్రాంగూడలోని హెచ్జీసీఎల్ (హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్)లోని కార్యాలయంలోని పలు చాంబర్లను, ఆఫీస్ స్పేస్ను పరిశీలించారు. హెచ్జీసీఎల్ కార్యాలయంలోని అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఎంఆర్డీసీ కార్యాలయం ఏర్పాటుపపై చర్చించారు. ఇక్కడి రెండు భవనాల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన ఫర్నిచర్ను సమకూర్చి, ఉన్నతాధికారులకు అవసరమైన చాంబర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.