సిటీబ్యూరో : సినిమాలు తీసేందుకు కావాల్సిన డబ్బును నిర్మాత అట్లూరి నారాయణరావు మోసాలతో సంపాదించినట్లు సీసీఎస్ పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. చాక్లెట్ల డిస్ట్రిబ్యూషన్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించి.. అధిక లాభాలు ఎరవేసి రెండు తెలుగు రాష్ర్టాల్లో రూ. 530 కోట్ల మోసానికి పాల్పడిన కేసులో నారాయణరావు నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల సీసీఎస్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, కోర్టు అనుమతితో రెండు రోజుల కస్టడీలోకి తీసుకొని విచారించారు. కస్టడీ గడువు ముగియడంతో బుధవారం అతడిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. బంజారాహిల్స్లోని ఆదిత్య హిల్టాప్ అపార్టుమెంట్లో నివాసముంటూ.. సినీ రంగంలోకి నిర్మాతగా ప్రవేశించాడు. 2018లో ‘నీది నాది ఒకే కథ’, 2022లో ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ చిత్రాలు తీశాడు.
ఈ సినిమాలకు అవసరమైన డబ్బు కోసం శేరిలింగంపల్లిలోని తారానగర్లో దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన 3 ఎకరాల భూమికి నకిలీ పత్రాలు సృష్టించి, వాటి ఆధారంగా ఖైరతాబాద్లోని ఎస్ఎంహెచ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన సయ్యద్ మహమూద్ హుస్సేన్ను సంప్రదించి.. ఆ స్థలాన్ని అమ్ముతానని నమ్మించి అతడి వద్ద కోటి రూపాయలు వసూలు చేశాడు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్తో మంచి సంబంధాలు ఉన్నాయంటూ చెప్పుకుంటూ.. వారితో దిగిన ఫొటోలను వ్యాపారులకు చూపించాడు. విశాఖ, కర్ణాటకకు చెందిన కంపెనీల మధ్య జరుగుతున్న వివాదాన్ని కూడా పరిష్కరిస్తానంటూ నమ్మించినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.
ఇదిలాఉండగా.. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన గుదే రాంబాబు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కృష్ణంరాజు కలిసి తమ వద్ద పెట్టుబడి పెడితే అధిక లాభాలిస్తామంటూ పలువురిని నమ్మిస్తూ.. గొలుసుకట్టు విధానంలో వ్యాపారం చేస్తూ సుమారు 200 మంది నుంచి రూ. 530 కోట్లు వసూలు చేసి భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ కేసు నుంచి వీరిని బయటపడేస్తానంటూ నమ్మిస్తూ.. వారిని ఐపీ పెట్టించడానికి ప్రయత్నించడంతో పాటు వారి వద్ద నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది.