మేడ్చల్, జూలై19 (నమస్తే తెలంగాణ): భూ క్రమబద్ధ్దీకరణపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో దరఖాస్తుదారులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ భూములలో ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న నిరుపేదలు రెండున్నరేళ్లుగా భూ క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఇలాంటి వాటిని క్రమబద్ధీకరించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల నుంచి 58, 59 జీవోల కింద దరఖాస్తులను స్వీకరించింది. నిబంధలనకు లోబడి ఉన్న దరఖాస్తులను బీఆర్ఎస్ హయాంలోని అధికారులు పరిష్కరించారు. అయితే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా భూ క్రమబద్ధ్దీకరణ, పెండింగ్ దరఖాస్తులపై సర్కార్ నిర్ణయం తీసుకోలేదు.
భారీగా దరఖాస్తులు..
జిల్లాలో 58 జీవో కింద 28,082 దరఖాస్తులు రాగా, 59 జీవో కింద 15,200 దరఖాస్తులు వచ్చాయి. బీఆర్ఎస్ హయాంలోనే రెండు జీవోలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి 58 జీవోలో అర్హులైన దరఖాస్తులను కొన్నింటిని పరిష్కరించి క్రమబద్ధ్దీకరించారు. మిగతా దరఖాస్తుల పరిశీలన పూర్తి అయినా.. కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులను క్రమబద్ధ్దీకరించడంలో నిర్ణయం తీసుకోలేదు. జిల్లాలో 59 జీవో కింద దరఖాస్తుదారులు సుమారు రూ.6 కోట్ల వరకు చెల్లించినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. స్థలాలు క్రమబద్ధ్దీకరించకపోతే చెల్లించిన ఫీజులను తిరిగి ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.