సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : వచ్చే వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు జూన్ నుంచి అక్టోబరు 31 వరకు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనకు సిద్ధమైంది.
స్టాటిక్ లేబర్, మినీ మొబైల్ టీమ్లు, వాహనాలు, మొబైల్ ఎమర్జెన్సీ బృందాల ఏర్పాటులో భాగంగా సర్కిళ్ల వారీగా టెండర్లను ఆహ్వానించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. ప్రతి ఏటా తరహ ఈ ఏడాది కూడా సుమారు రూ. 36.98 కోట్లతో ప్రత్యేక బడ్జెట్తో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నారు. ఇప్పటికే వర్షాకాలం ముందే నాలాల పూడిక తీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. ఈ పనులను నెలాఖరు నాటికల్లా పూర్తి చేసే దిశగా చర్యలను వేగవంతం చేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు 166 అత్యవసర బృందాలను రంగంలోకి దింపనున్నారు. ఇందులో 64 మొబైల్, 104 మినీ మొబైల్ బృందాలు ఉండగా, 160 స్టాటిక్ లేబర్స్ టీమ్స్ ఉంటాయి. మొబైల్, మినీ మొబైల్ ఎమర్జెన్సీ టీమ్లలో షిప్టు వారీగా ప్రతి టీంలో నలుగురు కార్మికులు ఉంటారు. వివిధ సాధనాలను అందుబాటులో ఉంచుతారు. నీరు నిలిచిపోయిన ప్రాంతాలు, క్యాచ్పిట్ల వద్ద నిలిచిన నీటిని తొలగిస్తారు.
అలాగే ప్రతి చెరువుకు ఒక ఇన్చార్జితో పాటు ఇద్దరిని కేర్ టేకర్ (పర్యవేక్షకులు)గా నియమించనున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద అంచనా బట్టి దిగువకు చెరువు నీటిని విడుదల చేయడం, ఎప్పటికప్పుడు చెరువుల వరదపై అప్రమత్తంగా ఉండటం వంటి చర్యలు చేపడతారు. ఎన్ఎన్డీపీ పనులు జరిగే స్థలాల్లో ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా బారికేడ్ల్ల ఏర్పాట్లు, రోడ్లు మూసివేత, హెచ్చరిక బోర్డులు ఏర్పాటుపై దృష్టి సారిస్తారు.