కొండాపూర్, ఆగస్టు 19 : జ్ఞాపకాలను పదికాలాల పాటు పదిలంగా ఉంచడంతో పాటు భవిష్యత్ తరాలకు వాటి మాధుర్యాన్ని అందిచగల గొప్పతనం ఫొటోగ్రఫీకి ఉన్నదని ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఫొటోగ్రఫీ ప్రదర్శనకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వాణీదేవి మాట్లాడుతూ.. పాత జ్ఞాపకాలను ప్రస్తుత, భవిష్యత్ తరాలకు అందించేలా చేయగల గొప్పదనం ఫొటోగ్రఫీకి సొంతమన్నారు. ఇందులో పలువురు ఫొటోగ్రాఫర్లు తీసిన 100 చిత్రాలను ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 29 వరకు ప్రదర్శన కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె. లక్ష్మి, ఎస్వీ ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ అజిత, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, కమలాకర్, ఫొటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.
మాదాపూర్లోని ఎస్వీ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ వాణీదేవి ప్రారంభించి, ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అజిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.