గౌతంనగర్, ఏప్రిల్ 1: ‘మల్కాజిగిరి నియోజకవర్గం ప్రజలందరూ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులే…కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు అందరినీ కాపాడుకుంటా…ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వేరు కాదు. మనమంతా ఒక్కటే.. బీఆర్ఎస్లో గ్రూపులకు స్థానం లేదు. మల్కాజిగిరిని అభివృద్ధిలో గ్రేటర్లోనే మొదటిస్థానంలో నిలబెడుతాను’. అని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గౌతంనగర్ డివిజన్ సంజయ్నగర్లోని లక్ష్మీసాయి గార్డెన్లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అధ్యక్షతన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు రాజేశ్వర్రెడ్డి, శంభీపూర్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 25 ఏండ్లుగా పెండింగ్లో ఉన్న మౌలాలి కమాన్ రోడ్డు సమస్య పరిష్కారించామని, వరద ముంపు సమస్య పరిష్కారం కోసం బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు 80 శాతం పూర్తి చేసినట్లు చెప్పారు.
కులం, మతం పేరుతో..
తెలంగాణ వచ్చిన తరువాత అభివృద్ధిలో మల్కాజిగిరిని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ముందుకు తీసుకెళ్లారని ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్రెడ్డి అన్నారు. మతం, కులం పేరుతో బీజేపీ ముందుకు వస్తున్నదని, మతాలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పనిచేస్తున్నారన్నారు. తొమ్మిదేండ్లలో అనేక ఉద్యోగాలను కల్పించామని, ప్రభుత్వ రంగంలో 1.30 లక్షలు, రెండో విడతలో 90వేలు, ప్రైవేటు సెక్టారులో(ఐటీ) 16 లక్షల ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనామ్ చేసేందుకే టీఎస్పీఎస్సీలో బండి సంజయ్ అనుచరుడు రాజశేఖర్ను పెట్టాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మేకల సునీతారాముయాదవ్, ప్రేమ్కుమార్, మీనా ఉపేందర్రెడ్డి, శాంతి శ్రీనివాస్రెడ్డి, జితేంద్రనాథ్, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.