మన్సూరాబాద్, అక్టోబర్ 28: పురాతన భవనాల శిథిలాల వ్యర్థాలను ఇష్టానుసారంగా రోడ్లపై వేయకుండా ఫతుల్లాగూడలో నిర్మించిన రీసైక్లింగ్ వ్యర్థాల ప్లాంటుకు తరలించేలా కాంట్రాక్టర్లు, భవనాల యజమానులు చొరవ చూపాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి ఫతుల్లాగూడలో నిర్మించిన 500 టన్నుల రీసైక్లింగ్ ప్లాంటును గురువారం ఆయన కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు, కాంట్రాక్టర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీసైక్లింగ్ చేసిన వ్యర్థాల ద్వార పార్కింగ్ టైల్స్, ఫుట్పాత్ టైల్స్ లాంటివి తయారు చేసుకుని, తిరిగి వాటిని వినియోగించుకోవచ్చునని తెలిపారు. వ్యర్థాలను తరలించేందుకు టోల్ఫ్రీ నెంబర్ 18001201159లో సంప్రదించినట్లయితే నామ మాత్రపు రుసుముతో రీసైక్లింగ్ ప్లాంటుకు తీసుకెళ్లేందుకు సిబ్బంది సహకరిస్తారని ఆయన పేర్కొన్నారు. కొందరు శిథిలాలను చెరువులు, రోడ్లతో పాటు ఖాళీ స్థలాల్లో వేస్తూ చేతులు దులుపుకుంటున్నారని, దీని వలన నగరంలో కాలుష్యమయంగా తయారవుతుందని తెలిపారు. కాలుష్యంలేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుకునే ప్రక్రియలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు అనంతుల రాజిరెడ్డి, చెరుకు ప్రశాంత్గౌడ్, రామకృష్ణారెడ్డి, శివకుమార్, జైసింహారెడ్డి, రవీందర్రెడ్డి, శోభన్ తదితరులు పాల్గొన్నారు.