సికింద్రాబాద్, సెప్టెంబర్ 21: సంస్థాగత నిర్మాణంపై టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యవర్గాల నియామక ప్రక్రియ కొనసాగుతున్నది. బూత్స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు, అనుబంధ విభాగాలను నియమిస్తున్నారు. ఈ నెల 2న నిర్వహించిన జెండాపండుగ కార్యక్రమంతో సంస్థాగత నిర్మాణం ప్రారంభం కావడంతో డివిజన్, బూత్ స్థాయి, వార్డు కమిటీల నియామక ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ బూత్లు, వార్డులు, డివిజన్లలోనూ కమిటీలను దాదాపు నియమించారు. నూతన కార్యవర్గాల ఏర్పాటుపై పార్టీ శ్రేణుల్లో కొంగొత్త జోష్ కనిపిస్తున్నది.
రెండేండ్ల తరువాత సంస్థాగత నిర్మాణంపై తెలంగాణ రాష్ట్ర సమితి దృష్టి సారించింది. సికింద్రాబాద్, కంటోన్మెంట్లలో నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించగా.. కార్యవర్గాల కూర్పు ప్రక్రియ జోరుగా జరుగుతోంది. పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వ్యక్తులతోపాటు ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రాధాన్యతను ఇస్తూ నియామకం చేపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి మిగిలిన అన్ని పార్టీలకు భిన్నం. స్వరాష్ట్రం కోసం పోరాటం చేసి సాధించిన పార్టీగా ప్రజల్లో చిరస్థాయి గుర్తింపు దక్కించుకుంది. రెండు పర్యాయాలు ప్రభుత్వంలోకి వచ్చిన టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నట్టుగానే..పార్టీలోనూ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతను కల్పించారు. కాంగ్రెస్, బీజేపీ వంటి ఏ జాతీయ పార్టీలో లేని విధంగా టీఆర్ఎస్ నూతన ఒరవడితో ముందుకు సాగుతోంది. ఏ కమిటీ చెల్లుబాటు కావాలన్నా 51శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా వర్గాలకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం కల్పించాల్సిందే. 51శాతానికి పైగా ఆయా వర్గాలకు స్థానం లేకుంటే కమిటీలు చెల్లుబాటు కావని ఇప్పటికే అధిష్టానం ప్రకటించింది.
సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో అధికార టీఆర్ఎస్ శ్రేణుల్లో కొంగొత్త జోష్ కనిపిస్తోంది. అధినేత నిర్ణయంతో పార్టీ పదవులను భర్తీ చేస్తుండటంతో నూతన ఉత్సాహం రెట్టింపైంది. బూత్ స్థాయి నుంచి వార్డు, డివిజన్ కమిటీల వరకు నూతన కార్యవర్గాల కూర్పుతో కార్యకర్తలు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్లోని ఐదు డివిజన్లతో పాటు 222 బూత్స్థాయి కమిటీలు, బస్తీ కమిటీలతో పాటు, కంటోన్మెంట్లోని 232 బూత్స్థాయి కమిటీలు, ఎనిమిది వార్డు కమిటీలు, ఓ డివిజన్ కమిటీ ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యింది. ఈ నెల 30వ తేదీన ఎంపికైన కమిటీలను ప్రకటించనున్నారు.