దేశమంతటా స్వాతంత్య్ర సంబురాలు జరుగుతున్నాయి.. గల్లీగల్లీలో జాతి స్ఫూర్తిని నింపే గీతాలు మార్మోగుతున్నాయి. కానీ దేశభక్తంటూ గొప్పలు చెప్పుకునే కమల నాయకులు
జెండా పండుగ నాడు కయ్యానికి కాలు దువ్వారు. మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలో ఎమ్మెల్యే మైనంపల్లి, బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు
దారితీసింది. కమలం కార్యకర్తలు రెచ్చిపోవడంతో వేదికపైనున్న మహనీయుల చిత్రపటాలు ముక్కలయ్యాయి. అనంతరం మల్కాజిగిరి చౌరస్తాలోనూ ప్రభుత్వానికి
వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిఘటించారు. తొండి మాట్లాడే బండి రాకతో ఆ పార్టీ శ్రేణులు పోలీసుస్టేషన్లోనూ నానా హంగామా సృష్టించారు.
అదనపు బలగాల రాకతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
మల్కాజిగిరి, ఆగస్టు 15: పంద్రాగస్టు వేడుకల్లోనూ బీజేపీ రాజకీయం చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతి నేతలను స్మరించుకొని… జాతీయ పతాకం ఎగురవేసి… దేశభక్తిని ప్రదర్శించాల్సిన ఆ పార్టీ కార్పొరేటర్, కార్యకర్తలు చిల్లర గొడవలకు తెర లేపారు. మల్కాజిగిరి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో జరిగిన హంగామాలో జాతిపితతో పాటు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాలు కిందపడి పగిలిపోయినా.. పట్టించుకోకుండా నానా రభస సృష్టించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అక్కడికి వచ్చి స్థానిక గొడవను మరింత పెద్దది చేసేందుకు ప్రయత్నించారు. వారిని నిలువరించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ప్రతిఘటించారు.
ఆదివారం ఉదయం పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయానికి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు జెండా ఆవిష్కరణకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్, ఆ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యే మధ్య మాట మాట పెరిగింది. దీంతో బీజేపీ శ్రేణులు కయ్యానికి కాలు దువ్వారు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణలో అక్కడ ఉన్న జాతిపిత గాంధీతో పాటు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫొటోలు కిందపడి ఫ్రేమ్ అద్దాలు పగిలిపోయాయి. పరిస్థితి కాస్త శాంతించిన తర్వాత ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు జాతీయ జెండాను ఎగురవేశారు. కాగా, పంద్రాగస్టు వేడుకలు ముగిసిన తర్వాత కూడా బీజేపీ శ్రేణులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ.. మల్కాజిగిరి చౌరస్తాకు వెళ్లారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్లి బీజేపీ శ్రేణుల దుశ్చర్యను ఎండగట్టేందుకు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి సైతం కొంతసేపు రోడ్డుపై బైఠాయించి, బీజేపీ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. రెండు పార్టీల వాళ్లను అక్కడి నుంచి పంపించేశారు.
స్థానికంగా జరిగిన ఈ గొడవను మరింత పెద్దదిగా మార్చేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ నేతలు విజయశాంతి, రామచంద్రారావు అక్కడికి వెళ్లారు. వీరి వెంట నగరవ్యాప్తంగా ఉన్న బీజేవైఎం కార్యకర్తలు కూడా వచ్చి రెచ్చిపోయి హంగామా సృష్టించారు. అంతకు ముందే పోలీస్స్టేషన్లో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు ఫిర్యాదు చేస్తుండగా.. బీజేవైఎం కార్యకర్తలు గేటు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించే ప్రయత్నం చేయడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్పై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీవ్రంగా మండిపడ్డారు. అన్ని పార్టీలను తాను కలుపుకుని పోతుంటే… బీజేపీ కార్పొరేటర్ అభివృద్ధిని అడ్డుకుంటూ, మంచి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనపై చేసిన విమర్శలపై మైనంపల్లి ఘాటుగా స్పందించారు. ‘బండి సంజయ్… రాజకీయాల్లో నీవో బచ్చా. నేను కిందిస్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని.. జిల్లా అధ్యక్షుడిగా పనిచేశా… గ్రేటర్ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా ఎదిగా… అభివృద్ధి, సామాజిక పనులు చేస్తూ..అందరి మనిషిగా ఎదిగిన వాడిని. నా రాజకీయం ముందు నీ వెంత? అభివృద్ధితో నేను ముందుంటే దాన్ని చెడగొట్టి తప్పుడు మనుషుల తప్పుడు మాటలు విని.. నాపై వ్యక్తిగత విమర్శలు చేశావు. నేను భూ కబ్జాకోరును కాను. నీ పార్టీలో నీ వెనుకే ఉన్న వారు కబ్జాకోరులనే వాస్తవాన్ని గ్రహించు. రేపు హుజూరాబాద్కు వెళ్తున్నా.. దమ్ముంటే అక్కడ చూసుకుందాం రా..’ అని మైనంపల్లి సవాల్ విసిరారు.