ముషీరాబాద్, నవంబర్7 : టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందచేలా కృషి చేస్తూ పార్టీ నిర్మాణం కోసం చిత్తశుద్ధితో పని చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ఆదివారం ముషీరాబాద్ డివిజన్ గంగపుత్ర కాలనీలో డివిజన్ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ పదవులు వచ్చిన వారు రాని వారిని కలుపుకొని పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని కోరారు. డివిజన్ కమిటీల్లో పదవులు రానివారికి ఇతర పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని, విభేదాలకు తావులేకుండా పార్టీని పటిష్టం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంతోపాటు పేద, బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందేలా పాటుపడాలని కోరారు.
సికింద్రాబాద్ పార్లమెంటు ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్ మాట్లాడుతూ హుజూరాబాద్లో నైతిక విజయం గెల్లు శ్రీనివాస్దేనని, టీఆర్ఎస్ను ఒంటరిగా ఎదుర్కొనే సత్తాలేక కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజమని, వాటిని పట్టించుకోకుండా పార్టీ పటిష్టత కోసం కలిసికట్టుగా పని చేయాలని కోరారు. పార్టీ పదవులు వచ్చిన వారు ప్రభుత్వ పథకాలను, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. కష్టపడి పని చేసే నాయకులను పార్టీ ఎప్పుడూ ఆదరిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని పదవులు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ముషీరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాడబోయిన నర్సింగ్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టీఆర్ఎస్ నేత ముఠా జయసింహ, ముషీరాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆకుల అరుణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు శోభ, ప్రధాన కార్యదర్శి స్రవంతి, పార్టీ సీనియర్ నాయకులు ఎయిర్టెల్ రాజు, సాంబశివరావు, అజయ్ ముదిరాజ్, ఉమారాణి, హమ్మదుల్లా, గోవింద్, జీ.రాజు తదితరులు పాల్గొన్నారు.