ముషీరాబాద్, జూలై 15: భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తడంతో పలువురు ఇబ్బందులు పడ్డారు. మిట్ట ప్రాంతాల నుంచి వచ్చిన వరదనీరు లోతట్టు ప్రాంతాలైన అడిక్మెట్ డివిజన్ అంజయ్యనగర్, సాయిచరణ్ కాలనీ, ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్, గంగపుత్ర కాలనీ, ఆదర్శ్నగర్ బస్తీల్లోకి భారీగా వరద నీరు చేరింది. మరోవైపు లోయర్ ట్యాంక్బండ్, చిక్కడపల్లి, ముషీరాబాద్, వీఎస్టీ, భోలక్పూర్ ప్రధాన రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. వర్షం నీరు మోకాలి లోతు రోడ్ల పై నిలిపోవడంతో కాలనీవాసులు ఇబ్బంది పడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది, ఎమర్జెన్సీ బృందాలు వరద సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించి పరిస్థితిని చక్కదిద్దారు.
అడిక్మెట్ డివిజన్ అంజయ్యనగర్ను వరద నీరు ముంచెత్తింది. భారీ వర్షానికి ఓయూ, రైల్వే ట్రాక్ పరిసరాల నుంచి వరద నీటితో అంజయ్యనగర్ బస్తీలోని పలు ఇండ్లలోకి చేరింది. రాత్రి వరద ప్రవాహం రావడంతో స్థానికులు కట్టుబట్టలతో ఇండ్లపైకి ఎక్కారు. వరద నీరు వెళ్లడానికి మార్గం లేకపోవడం, పైపులైన్లలో భారీగా పూడిక చేరడంతో వరద నీరు బస్తీని ముంచెత్తింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు మోటార్లను తెప్పించి వరద నీటిని తోడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
అడిక్మెట్ డివిజన్ అంజయ్యనగర్ బస్తీలో వరద నీటి సమస్యను త్వరలో పరిష్కరించనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ఇందుకోసం రూ. 34 లక్షలు మంజూరు చేయించామని, రెండు, మూడు నెలల్లో పనులు చేపడతామన్నారు. భారీ వర్షం కారణంగా జలమయమైన అంజయ్యనగర్ బస్తీని గురువారం అధికారులతో పరిశీలించారు. వరద నీటి సమస్య తలెత్తడానికి గల కారణాలను అధికారులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వరద నీటి పైపులైన్ వ్యవస్థ శిథిలమైపోవడం, పైపులైన్లలో పూర్తి స్థాయిలో పూడిక తొలగించకపోవడంతో వరద నీరు సాఫీగా వెళ్లక తమ బస్తీని ముంచెత్తిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. వర్షం కురిసిన ప్రతిసారీ వరద నీటితో ఇక్కట్లు పడుతున్నామని, ఇండ్లలో వరద నీరు చేరి నిత్యావసర వస్తువులు పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పలువురు విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే ఉన్నతాధికారులతో మాట్లాడి అదనపు మోటార్ పంప్ తెప్పించి వరద నీటిని తోడేలా చర్యలు తీసుకున్నారు. అంజయ్యనగర్కు వరద ఇక్కట్లు లేకుండా త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని, ఇందుకోసం ప్రత్యేక పైపులైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శ్రీనివాస్, డిప్యూటీ ఈఈ సన్ని, ఎఈ తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, సుధాకర్గుప్త, శ్యామ్ సుందర్, బి.శ్రీనివాస్రెడ్డి, సురేందర్, మహ్మద్ ఖదీర్, రవి యాదవ్, సయ్యద్ అస్లాం, మాధవ్, ఖలీల్, అబ్బు తదితరులు పాల్గొన్నారు.