బంజారాహిల్స్,జనవరి 24: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బస్తీలు, కాలనీల్లో హడావుడి చేస్తున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి అభివృద్ధి పనుల కోసం ఎన్నికోట్ల నిధులు తీసుకొచ్చారో ప్రజలకు చెప్పాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితో కలిసి ప్రారంభించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 8లోని కల్ప స్కూల్ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10 వరకు రూ. 51లక్షల వ్యయంతో సీవరేజ్ లైన్ పనులు, విమలాబాయి నగర్లో రూ.11.70లక్షలు, దూద్ఖానా బస్తీలో రూ.10లక్షల వ్యయంతో చేపట్టిన సీవరేజ్లైన్ పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ మోడల్ వైపు చూస్తుంటే బీజేపీ నాయకులు మాత్రం అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పనిచేస్తున్న కిషన్రెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్లమెంట్ పరిధిలో పర్యటనలు చేస్తున్నారని, నియోజకవర్గంలో అభివృద్ధ్ది పనుల కోసం కేంద్రప్రభుత్వం నుంచి ఎన్నికోట్లు తీసుకొచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారని,బీఆర్ఎస్ నాయకులు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం హరిశంకర్, మేనేజర్ శివకుమార్, జీహెచ్ఎంసీ సర్కిల్ 18 ఏఎంవోహెచ్ డా.ప్రవీణ, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాములు చౌహాన్,నాయకులు రాంచందర్, జావెద్,అశ్వక్, ప్రేమ్,మాదాస్ ఆనంద్కుమార్, నల్ల శివమాదిగ తదితరులు పాల్గొన్నారు.