బడంగ్పేట, మే 13 : మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో వీధి వ్యాపారుల కోసం షెడ్లను ఏర్పాటు చేయిస్తున్నారు. ఆర్సీఐ రోడ్డు మంత్రాల చెరువు సమీపంలో రూ.5లక్షలతో పనులు తుది దశకు చేరుకున్నాయి. 48 దుకాణాలను వీధి వ్యాపారుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధులు, రోడ్లపై వ్యాపారం చేసుకునే వారికి దుకాణాలను కేటాయించనున్నారు. స్ట్రీట్ వెండర్లను అధికారులు గుర్తిస్తున్నారు. పది రోజుల్లో షెడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అదే విధంగా లెనిన్నగర్ రైతు బజార్లో మహిళా సంఘాల కోసం మహిళా భవనం కాంప్లెక్స్ రూ.30లక్షలతో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 7 దుకాణాలను ఏర్పాటు చేశారు. మరో ఏడు దుకాణాలను పైన ఏర్పాటు చేయనున్నారు.
మహిళలు వ్యాపారం చేసుకోవడానికి వీలుండే విధంగా దుకాణాలను ఏర్పాటు చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి, చిన్న చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మంత్రి నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు చేయూతనిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారని ఆలోచనతో మహిళా కాంప్లెక్ భవనం ఏర్పాటు చేయించారు. త్వరలోనే మహిళా భవనం పనులు పూర్తి చేయనున్నారు. దీంతో మహిళలకు, వీధి వ్యాపారుల కోసం ఉపాధి కేంద్రాలుగా మారనున్నాయి.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్న ఆలోచనతో..
మహిళల ఆత్మగౌరవాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాపాడుతున్నారు. మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. మహిళల కోసం అధిక రుణాలు ఇచ్చి వారిని మహిళా పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుల్వ లక్ష్యం. మీర్పేట, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి వ్యాపారుల కోసం షెడ్లు, మహిళా భవనాలు నిర్మాణం చేయిస్తున్నాం. మహిళలకు ఉపాధి చూపించాలన్న ఆలోచన. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటారు. వారికి అవకాశం ఇస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అవసరమైన మేరకు నిధులు కేటాయిస్తున్నందుకు కృతజ్ఞతలు.
– పి.సబితా ఇంద్రారెడ్డి, మంత్రి
వారం రోజుల్లో పనులు పూర్తి..
మీర్పేట మంత్రాల చెరువు సమీపంలో వీధి వ్యాపారుల కోసం ఏర్పాటు చేస్తున్న షెడ్ల నిర్మాణ పనులు వారం రోజుల్లో పూర్తి చేయిస్తాం. రూ.50లక్షలతో పనులు చేయడం జరుగుతుంది. 48 షెడ్లు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం పనులు చివరి దశకు వచ్చాయి. రైతు బజార్ దగర నిర్మాణం చేస్తున్న మహిళా భవనం పనులు త్వరలో పూర్తి చేయిస్తాం. రూ.30లక్షలతో పనులు జరుగుతున్నాయి. 7 షాపులు పూర్తి చేయడం జరిగింది. పై అంతస్తులో మరో ఏడు షాపులు ఏర్పాటు చేయిస్తాం. ఇప్పటికే వీధి వ్యాపారులను గుర్తించాం.
– గోపీనాథ్, డీఈ