అబిడ్స్, మే 29 : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో తెలంగాణ ముందంజలో ఉన్నదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మహేశ్వరి సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహేశ్వరి మహోత్సవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వివిధ భాషలు, సంస్కృతులకు నిలయంగా ఉన్నదని, ఇక్కడ స్థిరపడిన ప్రతి ఒక్కరినీ తమ బిడ్డలుగా భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటూ వారి అభివృద్ధికి చేయూతనందిస్తున్నదని చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, అన్ని వర్గాల ప్రజల ఆచారాలు, సంస్కృతులను ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు.
ప్రభుత్వం మహేశ్వరి సమాజ్కు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహేశ్వరి సభ అధ్యక్షుడు హరినారాయణ రాఠీ, మహేశ్వరి మహిళా సంఘం అధ్యక్షురాలు రజనీ రాఖే, మహేశ్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాధేశ్యామ్ పాడియా, రంగు శారద, మహేశ్ బల్దా తదితరులు పాల్గొన్నారు.