అమీర్పేట్, మే 4 : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దేవాలయాన్ని మహా పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మొక్కుల రూపంలో భక్తులు సమర్పించుకున్న బంగారం, వెండిని అమ్మవారి ఆభరణాల తయారీకి వినియోగిస్తామని తెలిపారు. అమ్మవారికి 2.2 కేజీల బంగారంతో కిరీటం, పాదాలు, చేతులు తదితర ఆభరణాలు చేయిస్తామన్నారు. దాతల చేయూతతో రూ.32 లక్షల వ్యయంతో నిర్మించిన 34 పూజా సామగ్రి దుకాణాలను మంత్రి గురువారం ప్రారంభించారు.
దీర్ఘకాలంగా స్థానికంగా పూజా సామగ్రి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వారికి ఈ దుకాణాలు ఉచితంగా అందజేశారు. అనంతరం దేవాదాయ శాఖ రీజనల్ కమిషనర్ రామకృష్ణ, దాతలు కొండ్రాజు సుబ్బరాజు, బండారు సుబ్బారావులతో కలిసి నిర్మాణంలో ఉన్న మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ను సందర్శించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి వచ్చే అయిదు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు.
అమ్మవారి దర్శనానికి నగర నలుమూలల నుంచి వస్తుండే భక్తులకు వాహనాల పార్కింగ్ కోసం పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలిపారు. వచ్చే నెల 20న జరిగే అమ్మవారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఇందులో భాగంగా ఈ నెల 10న అన్ని విభాగాల అధికారులతో కలిసి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు దుకాణాల ప్రారంభోత్సవానికి విచ్చేసి మంత్రికి స్థానిక మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ సహాయ కమిషనర్ కృష్ణ, ఆలయ చైర్మన్ కొత్తపల్లి సాయిబాబ గౌడ్, కార్పొరేటర్ కేతినేని సరళ, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, ఈవో ఎస్.అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.