మారేడ్పల్లి, సెప్టెంబర్ 22: సమాజంలో ధనవంతులు చాలా మంది ఉంటారు.. సామాజిక స్ఫూర్తి కలిగిన వారు కొంత మంది మాత్రమే ఉంటారు.. అందులో డాక్టర్ మునగా రామ మోహనరావు ఒకరని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్పల్లి ప్రభుత్వ కళాశాల ఆవరణలో దాత డాక్టర్ మునగా రామ మోహన్రావు (రూ.3 కోట్లు) తన సొంత నిధులతో నిర్మించిన ‘ డాక్టర్ మునగా రామ మోహన రావు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల’ నూతన భవనాన్ని బుధవారం ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్గుప్తా, మునగా రామ మోహన రావు లక్ష్మి దంప తులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేటర్ స్థాయిలో ప్రభుత్వ కళాశాల భవనాన్ని సొంత నిధులతో నిర్మించి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కళాశాలలో ఇంకా ఏమైన వసతులు కావాలంటే ప్రభుత్వం తరుఫున, దాతల సహకారంతో కల్పిస్తామని చెప్పారు. 16 వేల అడుగుల స్థలంలో జి ప్లస్ వన్ నూతన భవనాన్ని నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు గుర్తింపు పొందిన పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు సాధించినందుకు కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవిని అభినందించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్గుప్తాను కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు రూ.కోటి ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జి.లాస్య నందిత, మాజీ బోర్డు సభ్యులు నళిని కిరణ్, అనిత ప్రభాకర్, విద్యాశాఖ డీఐఈఓ వడ్డెన్న, రీజినల్ జేడీ జయప్రభ బాయి, కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, వివిధ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్స్ ఎన్.జ్యోతి, ఎస్వీ. శైలజ, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఉజ్వల్, తదితరులు పాల్గొన్నారు.