హైదరాబాద్: హైదరాబాద్లో ఆషాఢ బోనాల (Ashada bonalu) జాతర వచ్చే నెల 22న ప్రారంభం కానుంది. నెలరోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు గోల్కొండ కోటలోని (Golkonda) జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారికి తొలిబోనంతో ఉత్సవాలు మొదలవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజాలో బోనాల ఏర్పాట్లపై మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మేయర్ విజయలక్ష్మి, డీజీపీ అంజనీ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. జూన్ 22న గోల్కొండలో ఆషాఢ బోనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు (Mahankali Bonalu), వచ్చే 10న రంగం (Rangam) నిర్వహిస్తామని తెలిపారు. జులై 16న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు ఉంటుందన్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను సీఎం కేసీఆర్ (CM KCR) రాష్ట్ర పండుగగా ప్రకటించారని చెప్పారు. మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందన్నారు.