వరద సమస్యకు అందరూ మెచ్చుకునే ఉపాయం ఆలోచించింది ప్రభుత్వం. ముంపు సమస్యకు ప్రధాన కారణమైన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయడంతో పాటు.. అదే సమయంలో అర్హులైన నిర్వాసితులకు వెంటనే పునరావాసం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నది. కూల్చివేతల సందర్భంగా ఇండ్లు కోల్పోయే వారికి నగరంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 14 నుంచి ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టడంతోపాటు.. అధికారులు నిరుపేదల జాబితా రూపొందించనున్నారు. ఈ వానకాలంలో నాలాల్లో పూడికతీత పనులకు ప్రత్యేకంగా రూ.45 కోట్లు కేటాయించి పనులను ముమ్మరం చేయనున్నారు.
సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ ) : నాలాల ఆక్రమణలు, పూడిక తొలగింపు పనులపై శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాలాల పరీవాహక ప్రాంతాల్లో నిరుపేదలు నిర్మించుకున్న చిన్నచిన్న ఇండ్ల వల్ల వానకాలంలో వరద ప్రవాహానికి ఆటంకం కలుగుతోందన్నారు. అలాంటి వారి జాబితాను వెంటనే రూపొందించి నగరంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లలో పునరావాసం కల్పించాలన్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం ద్వారానే నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి చెప్పా రు. ఈ నేపథ్యంలో ఈనెల 14 నుండి వారం రోజుల పాటు అధికారులంతా ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని ఆయన సూచించారు.
నాలాల్లో పూడికతీత పనుల కోసం ప్రత్యేకంగా రూ.45 కోట్లు కేటాయించినట్లు తలసాని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పనులు కొనసాగించేందుకు అవసరమైన అత్యాధునిక వాహనాలను సమకూర్చుకోవాలని సూచించారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసేందుకు ఈడీ విశ్వజీత్ ఆధ్వర్యంలో నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కమిషనర్ లోకేశ్ కుమార్ను మంత్రి ఆదేశించారు.
నాలాల పూడిక తొలగింపు, నీటి మళ్లింపు, అభివృద్ధి, చెరువుల పరిరక్షణ అంశాలపై మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్షాపును నిర్వహించుకుందామని ఈ సందర్భంగా తలసాని తెలిపారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, కమిషనర్ లోకేశ్కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజీత్, సీఈలు దేవానంద్, వసంత పాల్గొన్నారు.