మియాపూర్ (హైదరాబాద్) : బహుజనుల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన మహోన్నతుడు సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Minister Srinivas Goud ) అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తిను ఆదర్శంగా తీసుకుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మియాపూర్ ఆల్విన్ కాలనీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని(Statue) మంత్రి శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తని అభివర్ణించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా భారీ కాంస్య విగ్రహాన్ని మియాపూర్లో నెలకొల్పడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్రెడ్డి, గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ గౌడ్ , కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి
ఆత్యంత ఆధరణ పొందుతున్న రంగాలలో ఫోటోగ్రఫీ ఒకటిగా నిలుస్తుండడం సంతోషంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం(Photography Day) సందర్భంగా మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ ఫోటోగ్రఫీ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఫోటోగ్రఫీకి ప్రత్యేక కోర్సును ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. టెక్నికల్గా ఫోటోగ్రాఫర్లను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడేలా జేఎన్టీయూలో కోర్సును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు.