మాదాపూర్, జూన్ 23: తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పేదోళ్లకు మంచిరోజులు వచ్చాయని వారు సంపన్నులు అవుతారని టూరిజం, ఎక్సైజ్శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాదాపూర్లోని సీసీఆర్టీలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరై కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అల్లూరి జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు అల్లూరి జయంతి, వర్ధంతి వేడుకలకు ప్రాధాన్యతనిస్తూ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ఎన్ని మార్పులు వచ్చాయో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు.
అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ.. అందరికీ సమన్యాయం చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ రూ.200 కోట్లు నడుస్తున్న భూముల ధరలు.. నాలుగు రోజులు గడిస్తే.. మరో రెండు రెట్లు పెరుగుతాయని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచం మొత్తం చూస్తుందని, ప్రపంచంలోనే అతి సంపన్న నగరం హైదరాబాద్ అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మోటార్లు లేకుండానే తెలంగాణలో నల్లా నీళ్ళు పుష్కలంగా అందుతున్నాయని, కరెంట్ ఉత్పత్తి బాగుందని, 24 గంటలు కరెంట్ కోతల్లేకుండా నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని అన్నారు. వేలకోట్ల విలువచేసే కోహినూర్ వజ్రం హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాలోని కృష్ణానది తీరంలో దొరికినట్లు చెప్పారు. కులమతాలకు అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశారని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని, అడుగడుగున సీసీ కెమెరాల నిఘాలో 24 గంటలు రక్షణగా ఉందన్నారు. మహిళలకు రక్షణగా అన్ని రంగాల్లో అద్భుత కల్పన, ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి జరిగిందన్నారు. పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారని తెలిపారు.