సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్ : రాష్ట్రంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ రూ.10 వేల కోట్లు కేటాయించారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. దవాఖానలో ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో రోటరీ క్లబ్, హెటిరో సంస్థ సహకారంతో స్కిన్ బ్యాంకును సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, ఉస్మానియా దవాఖానకు దేశంలోనే ఉస్మానియాకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ దవాఖానకు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి రోగులు వచ్చి చికిత్స చేయించుకుంటారన్నారు. ఇంతటి గొప్ప ఉస్మానియా దవాఖానలో స్కిన్బ్యాంక్ ప్రారంభించడం సంతోషకరమని ఇది రెండు తెలుగు రాష్ర్టాలలోనే తొలిసారి అన్నారు.
స్కిన్బ్యాంక్ వల్ల తీవ్రం గా కాలిన గాయాలకు గురైన రోగుల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. స్కిన్బ్యాంక్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించడంతో పాటు దాని నిర్వహణ కోసం రూ.75 లక్షలు ప్రకటించిన హెటిరో డ్రగ్స్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ పార్థసారథిని మంత్రి అభినందించారు. ఎమ్మెల్సీ ప్రభాకర్రావు, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళారెడ్డి, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ పలుకూరి లక్ష్మి, డాక్టర్ నాగప్రసాద్, హెటిరో చైర్మన్ డాక్టర్ పార్థసారధి, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమంత్రెడ్డి, డాక్టర్ పాండు నాయక్ పాల్గొన్నారు.