ప్రజల సమస్యలపై ఆరా.. కార్మికులతో ముచ్చట
స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాదు..వారితో మమేకమై కుశల ప్రశ్నలు వేస్తూ.. మంత్రి కేటీఆర్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. భాగ్యనగరాన్ని అభివృద్ధిలో అగ్రపథాన నిలిపేందుకు ప్రగతి రథాన్ని పరుగులు పెట్టిస్తున్న ఆయన శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గాన్ని చుట్టేశారు. సుమారు రెండు గంటల పాటు సాగిన పర్యటనలో రూ.28.51 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, పారిశుధ్య కార్మికులతో ముచ్చటించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక మహిళలు విన్నవించిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్లో ఐదెకరాల్లో రూ.3.23 కోట్లతో అభివృద్ధి చేసిన కైలాసవాసాన్ని బల్దియా పారిశుధ్య కార్మికురాలు పున్నమ్మతో కలిసి ప్రారంభించారు. 9వ ఫేజ్లో రూ.1.50 కోట్లతో నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్టును ప్రారంభించి.. కాసేపు షటిల్ ఆడి ఆకట్టుకున్నారు. విన్నపాలను స్వీకరిస్తూ.. ఆడిగిన వారితో సెల్ఫీలు దిగుతూ.. మంత్రి కేటీఆర్ పర్యటన ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.
ఓల్డ్ బోయిన్పల్లిలో బోయిన్ చెరువు రిటైనింగ్ వాల్, మానస సరోవర్ నాలా టీ జంక్షన్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్.. చిత్రంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్కుమార్, కార్పొరేటర్లు సబీహాబేగం, ముద్దం నర్సింహ యాదవ్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత తదితరులు
సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ)/ బాలానగర్/కేపీహెచ్బీకాలనీ : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఏడు చోట్ల పర్యటించి రూ.28.51కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిపారు. ప్రజలతో మమేకమవుతూ.. పలువురు ఇచ్చిన విన్నపాలను స్వీకరిస్తూ.. పారిశుధ్య కార్మికులతో ముచ్చటిస్తూ.. అడిగిన వారితో సెల్ఫీలు దిగుతూ మంత్రి కేటీఆర్ పర్యటన ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా రోడ్లన్నీ గులాబీమయం అయ్యాయి.
కేపీహెచ్బీ 9 ఫేజ్లో మహిళలతో సెల్ఫీ దిగుతున్న మంత్రి కేటీఆర్
కూకట్పల్లి నియోజకవర్గంలో రూ.28.51 కోట్ల వ్యయంతో చేపట్టిన ఏడు అభివృద్ధి పనులకు శుక్రవారం రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ వెంట మంత్రి చామకూర మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్ రావు, శంభీపూర్ రాజు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు, కార్పొరేటర్లు శిరీష బాబురావు, ముద్దం నర్సింహయాదవ్, మందాడి శ్రీనివాసరావు, రవీందర్ రెడ్డి, పండాల సతీష్గౌడ్, జోనల్ కమిషనర్ మమత, ఎస్ఈ చిన్నారెడ్డి, డీసీలు తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శవంతంగా అభివృద్ధి
కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో ఏండ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నామని చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, ట్రాఫిక్ సమస్యలన్నింటినీ పరిష్కరించామని, ఆహ్లాదకరంగా పార్కులు, క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్దినట్లు తెలిపారు. కేపీహెచ్బీలో కైలాసవాసం, ఇండోర్ షటిల్ కోర్టు, పార్కుల అభివృద్ధి, చెరువు సుందరీకరణ, ముంపు సమస్య పరిష్కారానికి నిధులను కేటాయించిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
– ఎమ్మెల్యే కృష్ణారావు
కైలాసవాసం పున్నమ్మతో ప్రారంభం
కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్లో ఐదెకరాల స్థలంలో రూ.3.23 కోట్లతో అభివృద్ధి చేసిన కైలాసవాసం (మహాప్రస్థానం.. హిందూ శ్మశానవాటికను) జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికురాలు పున్నమ్మతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కైలాసవాసంలో కలియతిరిగి దహనవాటికలు, స్నానం గదులు, మరుగుదొడ్లు, గ్రీనరీని పరిశీలించి అధికారులను అభినందించారు.
యోగ క్షేమాలు అడిగి.!
కేపీహెచ్బీ కాలనీ భువనవిజయం గ్రౌండ్లో రూ.1.95 కోట్లతో అభివృద్ధి చేసిన ఇండోర్ షటిల్ కోర్టు, కాంపౌండ్ వాల్ను ప్రారంభించారు. ఇండోర్ షటిల్ కోర్టులో షటిల్ ఆడుతూ క్రీడాకారులను పలుకరించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన మహిళలను స్వయంగా పలుకరిస్తూ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలుంటే వెంటనే అధికారులను పిలిపించి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
భువనవిజయం గ్రౌండ్లో ఇండోర్ షటిల్ కోర్టును ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీలు నవీన్రావు, శంభీపూర్ రాజు, డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి, కార్పొరేటర్లు, జెడ్సీ మమత
షటిల్ ఆడి.. సెల్ఫీలు దిగి..!
కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్లో రూ.1.50 కోట్లతో అభివృద్ధి చేసిన ఇండోర్ షటిల్ కోర్టును ప్రారంభించారు. ఈ షటిల్ కోర్టులో క్రీడాకారులను కలిసి కోర్టును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇండోర్ స్టేడియం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఒక వైపు, మరో వైపు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్రావు, జోనల్ కమిషనర్ మమత ఒక వైపు ఉండి షటిల్ ఆడారు. మంత్రి కేటీఆర్ తన ఎడమ చేతితో షటిల్ ఆడి ఆకట్టుకున్నారు. మహిళలు, క్రీడాకారులతో మంత్రి కేటీఆర్ సెల్ఫీలు దిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కళాకారుల విన్యాసాలను తిలకిస్తూ..!
బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ ఆధ్వర్యంలో చెరువుగట్టుపై ఏర్పాటు చేసిన కళాకారుల విన్యాసాలను మంత్రి కేటీఆర్ తిలకించారు. బోనాలు, డోలు వాయిద్యాలు, బతుకమ్మ ఆటపాటలు, పోతరాజుల విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు.
రంగధాముని చెరువు సుందరీకరణ
బాలాజీనగర్ డివిజన్లోని కూకట్పల్లి రంగధాముని (ఐడీఎల్) చెరువును రూ.9.80 కోట్లతో చేపట్టనున్న సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఐడీఎల్ చెరువును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
బాలాజీనగర్లో ఫ్రీడమ్ అభివృద్ధి
బాలాజీనగర్లో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాన్ని సీఎస్ఆర్లో భాగంగా ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ రూ.2 కోట్లతో చేపట్టనున్న హెచ్ఐజీ పారు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులను అభినందించి సన్మానించారు.