మంత్రి కొప్పుల ఈశ్వర్
ఆర్కేపురం, మార్చి 17 : వీఎం హోమ్ గురుకులాన్ని అత్యుత్తమ విద్యా సంస్థగా తీర్చిదిద్దుతామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సరూర్నగర్ డివిజన్లోని విక్టోరియా మెమోరియల్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల కోసం వైద్య ఆరోగ్య శాఖతో కలిసి అపోలో ఆస్పత్రి ఏర్పాటు చేసిన ఆరోగ్య పరీక్షల శిబిరం, రుద్రమదేవి ఆత్మరక్షణ, స్వరక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరాటే, యోగా, జిమ్నాస్టిక్స్ శిక్షణ తరగతులను మంత్రి కొప్పుల ఈశ్వర్, పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్గుప్త, ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్ డా.యోగితా రాణాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ గురుకులంలో ప్రస్తుతం 600 మంది బాలబాలికలు ఉన్నారని తెలిపారు. పదవ తరగతిలో నూటికి నూరుశాతం మంచి మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారని తెలిపారు. సొసైటీల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలతో సమానంగా ఈ స్కూల్స్ను అత్యుత్తమ విద్యా సంస్థగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. అంతకు ముందు మంత్రి ఆరోగ్య పరీక్షలు చేస్తున్న అన్ని విభాగాలను పరిశీలించి, వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో వీఎం హోమ్ పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీపార్వతి, ప్రముఖ వైద్యులు రవీంద్రబాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మెట్రోలో సరదాగా..
సరూర్నగర్ విక్టోరియా మెమోరియల్ గురుకుల పాఠశాలలో ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించేందుకు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మెట్రోరైలులో ప్రయాణించారు. పోలీసు గృహనిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తతో కలిసి అసెంబ్లీ స్టేషన్ నుంచి కొత్తపేటకు రైలులో వచ్చారు. -ఆర్కేపురం, మార్చి 17