Petrol Price | సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): పెరిగిన ఇంధన ధరలు హైదరాబాద్ నగర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తేలింది. ఈ పరిస్థితుల్లో అప్పుడప్పుడు మాత్రమే కార్లను వినియోగిస్తున్నట్లు సర్వేలో మెజార్టీ ప్రజానీకం అభిప్రాయపడింది. అర్బన్ మొబిలిటీ హ్యాపీనెస్ సర్వే ఫలితాలను ఎంజీ మోటార్ ఇండియా గురువారం విడుదల చేసింది. భారతదేశంలోని అహ్మదాబాద్, బెంగళూరు, పుణె, ముంబయి, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, హైదరాబాద్, కోల్కతా నగరాల్లో ప్రముఖ విశ్లేషణ సంస్థ ‘నీల్సన్’ ఈ సర్వేను నిర్వహించింది. కనీసం ఒక కారు కలిగి ఉన్న 18 నుంచి 37 ఏండ్లున్న స్త్రీ, పురుషులు ఈ సర్వేలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెరిగిన ఇంధన ధరల నేపథ్యంలో అప్పుడప్పుడు అత్యవసర సమయాల్లోనే వాహనాలను వినియోగిస్తున్నట్లు 73 శాతం మంది చెప్పారు.
ప్రతి నెలా ఇంధనం కోసమే రూ.6వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పెరిగిన ఇంధన ధరలతోపాటు నగరాల్లో వాయు, శబ్ద కాలుష్యాలు సైతం ఆందోళన కల్గిస్తున్నట్లు సర్వేలో తేలింది. పర్యావరణ సంరక్షణకు సంబంధించి ఆందోళన నెలకొన్నప్పటికీ మెజార్టీ ప్రజలు పెట్రోల్ ఆధారిత వాహనాలనే ఇష్టపడుతున్నట్లు స్పష్టమైంది. ముఖ్యంగా హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రయాణ సమయం పెరిగిందని 62 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే స్మార్ట్ కారు వల్ల ప్రయాణ సమయం చాలా తగ్గిందని 92 శాతం మంది తెలిపారు. అయితే నగరాల్లో పార్కింగ్ స్థలాలు అందుబాటులో లేక కార్ల యజమానులు ఇబ్బందులు పడుతున్నారని, పార్కింగ్ లేని కారణంగా కార్లను ఉపయోగించవద్దని కూడా నిర్ణయించుకున్నట్లు 64 శాతం మంది సర్వేలో తమ అభిప్రాయాలను తెలిపారు. సర్వే గురించి ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ..భారతీయ వినియోగదారులు తమ వాహనాల పనితీరు, ఫీచర్లతోపాటు సౌలభ్యం, భద్రత, పెరిగిన ఇంధన ధరలు తదితర వాటికి కూడా ప్రాధాన్యత ఇస్తారని సర్వే ద్వారా స్పష్టమైందన్నారు.