మహానగరంలో మెగా సిటీ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం కేసీఆర్ పెరుగుతున్న జనాభా, నగర విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసు సేవలను విస్తరించారు. దాదాపు 35 ఏండ్ల తరువాత నగర పోలీసు పునర్వ్యవస్థీకరణ జరుగడం విశేషం. ఇందులో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్లో రెండు కొత్త డీసీపీ జోన్లు, 11కొత్త ఏసీపీ డివిజన్లు, 11కొత్త పోలీసుస్టేషన్లు, 5 కొత్త ఉమెన్ పోలీసు స్టేషన్లు, 13 కొత్త ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు, ఒక ట్రాఫిక్ డీసీపీ, ఒక ట్రాఫిక్ ఏసీపీ డివిజన్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు రెండు కొత్త టాస్క్ఫోర్స్ యూనిట్లు, ఒక కొత్త ఐటీ-సెల్ యూనిట్, ఒక హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం(హెచ్-న్యూ), ఒక సైబర్క్రైమ్ యూనిట్, కొత్త సెక్రెటరియేట్ సెక్యూరిటీ యూనిట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు నగరంలోని మెగా పోలీసు వ్యవస్థపై శనివారం బంజారాహిల్స్లోని తన కార్యాలయంలో నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు. నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఠాణాల్లో జూన్ 2 (రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం) నుంచి ఎఫ్ఐఆర్లు నమోదు చేయనున్నారు. అలాగే పోలీసు ఠాణా పరిధిలతో పాటు నాలాలు, చెరువులు, రోడ్లు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల సరిహద్దులను ఆయన వివరించారు.
సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): జూన్ 2 నుంచి కొత్త ఠాణాల్లో ఎఫ్ఐఆర్లను నమోదు చేయడం ప్రారంభించనున్నామని, కొత్త డీసీపీ జోన్లు, డివిజన్లు, ఠాణాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన ప్రక్రియను పది రోజుల్లో పూర్తిచేసి, మెగా సిటీ పోలీసింగ్ను అందుబాటులోకి తీసుకొస్తామని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతోనే మెగా సిటీ పోలీసింగ్ సాధ్యమైందని, 35 ఏండ్ల తర్వాత నగర పోలీసు వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ జరిగిందన్నారు.
శనివారం బంజారాహిల్స్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సీపీ మెగా సిటీ పోలీసింగ్ ఏర్పాటుకు గల కారణాలు, పునర్వ్యవస్థీకరణ అంశాలను వివరించారు. 1987లో సుమారు 25 లక్షల జనాభాకు అనుగుణంగా అప్పట్లో నగర పోలీసు పునర్వ్యవస్థీకరణ జరిగిందని, ఆ తరువాత 2002లో జరిగిన సెమీ రీఆర్గనైజేషన్లో భాగంగా సెంట్రల్ జోన్ డీసీపీ, 2 అదనపు కమిషనర్, 2 జాయింట్ పోలీసు కమిషనర్ పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోజురోజుకు జనాభా పెరిగిపోవడం, నగరంలో కొత్తగా రోడ్లు, భవనాలు వంటివి వస్తుండడంతో వాహనాల సంఖ్యతో పాటు జనాభా పెరగడం తదితర అంశాల నేపథ్యంలో మెగా సిటీ పోలీసింగ్పై దృష్టిపెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. పలు అంశాలపై అధ్యయనం చేసిన కమిటీ నివేదిక ఆధారంగా మెగా సిటీ పోలీసింగ్ను రూపొందించినట్లు సీపీ వివరించారు. ఇందులో భాగంగా రెండు కొత్త డీసీపీ జోన్లు, 11 కొత్త ఏసీపీ డివిజన్లు, 11 కొత్త పోలీసు స్టేషన్లు, 5 కొత్త ఉమెన్ పోలీసు స్టేషన్లతో పాటు 13 కొత్త ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు, ఒక ట్రాఫిక్ డీసీపీ, ఒక ట్రాఫిక్ ఏసీపీ డివిజన్లను ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు రెండు కొత్త టాస్క్ఫోర్స్ యూనిట్లు, కొత్త ఐటీ-సెల్ యూనిట్, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం(హెచ్ న్యూ), సైబర్క్రైమ్ యూనిట్, కొత్త సెక్రటేరియట్ సెక్యూరిటీ యూనిట్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు.
సరిహద్దులు ఇలా..
మూసీ నది మధ్య భాగం నుంచి నదిని రెండు సమభాగాలుగా విభజించి ఆ రెండు భాగాల సరిహద్దులను సంబంధిత పోలీసు స్టేషన్లకు పంచినట్లు సీపీ ఆనంద్ వివరించారు. అదే క్రమంలో మూసీ నదిపై ఉన్న వంతెనలను సైతం రెండు సమభాగాలుగా విభజించి, దాని సరిహద్దులను సంబంధిత ఠాణాలకు కేటాయించామన్నారు. పెద్ద రోడ్లకు వాటి మధ్యలో ఉన్న డివైడర్లనే సరిహద్దులుగా నిర్ణయించామని, డివైడర్కు అవతలి వైపు ఉన్న సరిహద్దును సంబంధిత ఠాణాకు, ఇటు వైపు ఉన్న భాగాన్ని అదేవైపు ఉన్న ఠాణాకు కేటాయించినట్లు సీపీ వివరించారు. అదే క్రమంలో డివైడర్ లేని రోడ్లను రెండు సమభాగాలుగా విభజించి వాటి సరిహద్దులను సంబంధిత రెండు ఠాణాలకు కేటాయించినట్లు తెలిపారు. ఫ్లై ఓవర్ కింద రోడ్డుపై ఉన్న డివైడర్ ఆధారంగా లేదా కింద ఉన్న రోడ్డును రెండుగా విభజించి, అదే తరహాలో ఫ్లైఓవర్ బ్రిడ్జిపైన కూడా విభజన జరిపి సరిహద్దులను సంబంధిత రెండు ఠాణాలకు కేటాయించినట్లు సీపీ పేర్కొన్నారు. ఇదే సూత్రాన్ని పిల్లర్ నంబర్లకు కూడా అవలంభించినట్లు తెలిపారు.
రూ.33 కోట్లతో రీఆర్గనైజేషన్
నగర పోలీసు పునర్వ్యవస్థీకరణకు రూ.33 కోట్లు వెచ్చించినట్లు సీపీ ఆనంద్ వివరించారు. అందులో రూ.17 కోట్లు వాహనాలకు కేటాయించామన్నారు. మ్యాన్పవర్ ఆడిటింగ్ కూడా జరిగిందని, ఈ క్రమంలో గతంలో అటాచ్ చేసిన వందల మంది సిబ్బందిని తిరిగి వెనక్కి రప్పించినట్లు సీపీ వివరించారు. ప్రస్తుతం అవసరమున్న అన్ని రకాల విభాగాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడంతో పాటు దాదాపు 35 శాతం ఖాళీలను భర్తీ చేశామని, ఇక నుంచి సిబ్బందిని అటాచ్ చేయడం ఉండదని స్పష్టం చేశారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త పోస్టింగ్లు కల్పించడం, పదోన్నతులు, సిబ్బంది నియామకాలు జరగనున్నట్లు తెలిపారు.
ఇక్కడే కొత్త జోన్ కార్యాలయాలు
సౌత్ వెస్ట్జోన్ డీసీపీ కార్యాలయం మెహిదీపట్నంలోని ఆసిఫ్నగర్ ఏసీపీ కార్యాలయంలో
సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంమలక్పేట పాత ఏసీపీ కార్యాలయం వద్ద కొత్త భవనంలో
ఏసీపీ కార్యాలయాలు..
గోల్కొండ డివిజన్ ఏసీపీ కార్యాలయం గోల్కొండ పీఎస్ భవనంలో
కుల్సుంపురా డివిజన్ కార్యాలయం కుల్సుంపురా ఓల్డ్ పీఎస్ భవనంలో
ఛత్రినాక డివిజన్ కార్యాలయం న్యూ శాలిబండ పీఎస్ భవనం వద్ద
చాంద్రాయణగుట్ట డివిజన్ కార్యాలయం బండ్లగూడ పీఎస్ ఎదురుగా ఉన్న సబ్కంట్రోల్ భవనంలో
సైదాబాద్ డివిజన్ కార్యాలయం సైదాబాద్ పోలీస్స్టేషన్ మొదటి అంతస్తులో
గాంధీనగర్ డివిజన్ కార్యాలయం బీఆర్కే భవన్ గ్రౌండ్ ఫ్లోర్
తిరుమలగిరి డివిజన్ కార్యాలయం కార్ఖాన పీఎస్ 2వ అంతస్తులో
చిలుకలగూడ డివిజన్ కార్యాలయం బౌద్ధనగర్ కమ్యూనిటీ హాల్ ఫస్ట్ ఫ్లోర్
జూబ్లీహిల్స్ డివిజన్ కార్యాలయం జూబ్లీహిల్స్ పీఎస్ భవనం సెకండ్ ఫ్లోర్
ఉస్మానియా యూనివర్సిటీ డివిజన్ ఒయూ పీఎస్ భవనం
ఎస్ఆర్నగర్ డివిజన్ కార్యాలయం ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పీఎస్ భవనంలో