Government Hospitals | సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): నగరంలో వారం పది రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం, గవద బిల్లలు, చికన్ పాక్స్, డయేరియా వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. వీటికి తోడు కొన్ని ప్రాంతాల్లో డెంగీ కేసులు సైతం నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సర్కారు దవాఖానల్లో మందుల కొరత రోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సరైన మందులు లేక సగం మాత్రలు బయటనే తీసుకోమని చెబుతుండటంతో రోగులు పరేషాన్ అవుతున్నారు. మూడు నెలల కిందట దవాఖానల్లో ఎలాంటి మందుల కొరత ఉండేది కాదని, కొన్ని రోజులుగా ఏ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినా.. ఒక మందు ఉంటే..మరొకటి ఉండటం లేదని వాపోతున్నారు.
గాంధీ, ఉస్మానియా, నిలోఫర్తో పాటు వైద్య విధాన పరిషత్ పరిధిలోని రాజేంద్రనగర్, బుద్వేల్లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సహా పలు బస్తీ దవాఖానలు, పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో మందుల కొరత ఉన్నట్లు రోగులు వాపోతున్నారు. వైద్యులు జబ్బు ఆధారంగా మూడు లేదా ఐదు రోజుల కోర్సు చొప్పున మందులు రాస్తే.. ఆయా దవాఖానల్లో సిబ్బంది మూడు రోజులకు రాస్తే.. రెండు రోజులు.. ఐదు రోజులకు రాస్తే..మూడు రోజులకు అవి కూడా సగం సగం మాత్రమే మాత్రలు ఇస్తున్నట్లు రోగులు వాపోతున్నారు. ఈ విషయమై కొందరు దవాఖాన సిబ్బందిని నిలదీయడంతో చాలా దవాఖానల్లో అక్కడి అధికారులు ప్రిస్క్రిప్షన్పై కేవలం మందులు మాత్రమే రాయాలని.. ఎన్ని రోజులు అనేది రాయవద్దని వైద్యులకు సూచిస్తున్నట్లు సమాచారం.
చాలా దవాఖానల్లో దగ్గు మందును వైద్యులు రాసినా.. ఇవ్వడం లేదని, బయటి నుంచి కొనుగోలు చేసుకోవాలని సిబ్బంది సలహా ఇస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. రెండు రోజుల కిందట రాజేంద్రనగర్, బుద్వేల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యులు రోగులకు మూడు రోజులకు మందులు రాస్తే రెండు రోజులకు మాత్రమే ఇచ్చినట్లు అక్కడి రోగులు ఆరోపించారు. ‘ఆంబ్రాక్సిల్’ అనే దగ్గు మందును అక్కడి వైద్యులు రాసిచ్చినా.. తమ వద్ద లేదు, బయట కొనుక్కోవాలని ఫార్మసీ కౌంటర్లోని సిబ్బంది చెప్పినట్లు రోగులు తెలిపారు.
ఉస్మానియా వంటి దవాఖానల్లోనూ వైద్యులు రాసిన మందులు లేవని ఫార్మసీ కౌంటర్లలోని సిబ్బంది తప్పి పంపిస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. ఫీవర్ హాస్పిటల్లో ఓపీకి వచ్చే వారికి వైద్యులు డెంగీ పరీక్షలు రాస్తే..కిట్స్ లేవని అక్కడి సిబ్బంది తిప్పి పంపుతున్నట్లు పేషెంట్లు ఆరోపిస్తున్నారు. కేవలం ఐపీ రోగులకు మాత్రమే డెంగీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు దవాఖాన సిబ్బంది బహిరంగంగానే చెప్పడం గమనార్హం. దీంతో ఓపీ రోగులు గత్యంతరం లేక డెంగీ పరీక్షలను బయట చేయించుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.