బంజారాహిల్స్, జూలై 24 : హైదరాబాద్ నగరాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో జీహెచ్ఎంసీ చేస్తున్న కృషితో పాటు పౌరుల పాత్ర కీలకమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. రెడ్ ఎఫ్ఎం సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచడం కోసం రూపొందించిన ‘రెఢీ ఫర్ చేంజ్’ వీడియోను సోమవారం మేయర్ ఆవిష్కరించారు. నెక్లెస్రోడ్ ప్రాంతంలో సందర్శకులు చెత్తాచెదారం రోడ్లపై పారవేయకుండా డస్ట్బిన్స్ను వినియోగించేలా చూడడంతో పాటు వారిలో స్వచ్ఛత గురించి అవగాహన కల్పించేలా వీడియో రూపొందించామని, రెడ్ ఎఫ్ఎం సోషల్ మీడియా వేదికలపై వీటిని ప్రదర్శిస్తామని రెడ్ ఎఫ్ఎం ప్రతినిధులు ఆయుషీ, ఆర్జే చైతూ తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పౌరుల్లో మరింత బాధ్యత పెంచేలా రెడ్ ఎఫ్ఎం సంస్థ ‘రెడీ ఫర్ చాలెంజ్’ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. స్వచ్ఛతను పాటించడంలో పౌరులను ప్రోత్సహించేలా మీడియా సంస్థలు ఇలాంటి ప్రయత్నాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. జీహెచ్ఎంసీ తరఫున ఎన్ని స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించినా పౌరుల సహకారం లేకపోతే పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించలేమని అన్నారు.