పారిశుధ్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడమే లక్ష్యంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి క్షేత్రస్థాయిలో ఆకస్మిక పర్యటనలకు శ్రీకారం చుట్టింది. కొవిడ్ విజృంభిస్తున్న దరిమిలా గ్రేటర్ నలుమూలల ఎక్కడా రహదారులపై చెత్త ఉండకుండా చర్యలు తీసుకోవాలన్న మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే పారిశుధ్య నిర్వహణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఐదు రోజులుగా మేయర్ జోన్ల వారీగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం ఖైరతాబాద్, కూకట్పల్లిజోన్లలో అధికారులతో కలిసి మేయర్ పలు ప్రాంతాలను సందర్శించారు. తొలుత తన ట్విట్టర్లో వచ్చిన ఫిర్యాదుల పరిశీలనకు మేయర్ బల్కంపేట, బీకేగూడ, దాసరం బస్తీలో పర్యటించారు. బస్తీలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని అధికారులకు మేయర్ ఆదేశాలు జారీ చేశారు.