సిటీబ్యూరో, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ నైజీరియన్ సైబర్నేరగాళ్ల చేతికి చిక్కి రూ. 8.9 లక్షలు పోగొట్టుకున్నాడు. డైవర్స్ మ్యాట్రీమోని వెబ్సైట్లో తన ప్రొఫైల్ను అప్లోడ్ చేసిన సదరు లెక్చరర్కు లండన్కు చెందిన హెండ్ర హరిసన్ అనే పేరుతో ఓ మహిళ పెండ్లి చేసుకుంటానంటూ.. ముందుకొచ్చింది. అది నిజమని నమ్మిన బాధితుడు ఫోన్ నంబర్లు మార్పిడి చేసుకున్నారు. కొన్నాళ్లు చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ మహిళ తాను ఇండియాకు రెండు లక్షల పౌండ్లు తీసుకొని వస్తున్నానని నమ్మించింది. రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి.. తనను ఢిల్లీ ఎయిర్పోర్టులో పట్టుకున్నారని, కొంత ఫీజు చెల్లిస్తే పౌండ్లు చేతికి వస్తాయని నమ్మించింది. ఆమె చెప్పే మాటలు నమ్మిన బాధితుడు దఫ దఫాలుగా రూ. 8.9 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశాడు. ఇంకా డబ్బు అడుగుతుండటంతో మోసమని గుర్తించి.. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.