కేపీహెచ్బీ కాలనీ, జూన్ 30 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో పరిసరాలన్నీ శుభ్రంగా మారాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అధికారులను ఆదేశించారు. బుధవారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో పట్టణ ప్రగతి నిర్వహణపై డీసీలు, వివిధ విభాగాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. నగరంలో మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించే దిశగా నేటినుంచి పదో తేదీవరకు నిర్వహిస్తున్న పట్టణ ప్రగతిలో ప్రజలను, ప్రజా ప్రతినిధులను భాగస్తులను చేస్తూ కాలనీలు, బస్తీలన్నింటినీ శుభ్రంగా మార్చాలన్నారు. వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించాలని.. రోడ్ల పక్కన చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు, మట్టి కుప్పలు, రాళ్లు ఇతర వ్యర్థాలు లేకుండా తొలగించాలన్నారు.
వానకాలంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రమాదకరంగా ఉన్న నాలాల పక్కన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. వర్షంనీటి కాలువలలో వ్యర్థాలన్నింటినీ తొలగించి వాటిని నిర్మానుష్య ప్రాంతాలకు తరలించాలన్నారు. సమావేశంలో ఉప కమిషనర్లు కె.రవికుమార్, వి.ప్రశాంతి, రవీందర్కుమార్, మంగతాయారు, నాగమణి, టౌన్ప్లానింగ్ సీపీ ఉమాదేవి, ఎస్ఈ శంకర్ నాయక్, ఏఎంహెచ్వోలు, డీఈలు, ట్రాన్స్పోర్ట్ విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కేపీహెచ్బీ కాలనీ, జూన్ 30 : పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా చేపడుతున్న పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని డీసీ రవికుమార్ అన్నారు. బుధవారం మూసాపేట సర్కిల్ కార్యాలయంలో పట్టణ ప్రగతిపై కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, పగడాల శిరీషాబాబూరావు, పండాల సతీశ్గౌడ్, కొడిచెర్ల మహేందర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలు, బస్తీలలో చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించేలా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఎంహెచ్వో సంపత్కుమార్, ఇంజినీరింగ్, ఎంటమాలజీ, టౌన్ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.