సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగు రోడ్డు వెంబడి నిర్మించిన సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్వహణను ప్రతిష్ఠాత్మంగా చేపట్టాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్ణయించింది. ఐటీ కారిడార్లో సుమారు 23 కి.మీ పొడవునా, రెండు కారిడార్లలో నిర్మించిన సైకిల్ ట్రాక్ను త్వరలోనే మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. సుమారు రూ.100 కోట్లకు పైగా వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన సైకిల్ ట్రాక్ నిర్వహణ నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించడం ద్వారా నిత్యం మెరుగైన రీతిలో అందుబాటులో ఉండనుంది. ఇందుకోసం సుమారు రూ.9.24 కోట్లతో ఓఆర్ఆర్ సైకిల్ ట్రాక్ ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ చేపట్టేలా టెండర్లను పిలిచారు.
రెండు మార్గాల్లో నిర్మించిన సైకిల్ ట్రాక్ నానక్ రామ్ గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.50 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు 14.5 కిలోమీటర్ల వరకు నిర్మించారు. ఈ సైకిల్ ట్రాక్పై నిర్మిస్తున్న సోలార్ రూఫ్ టాప్తో సుమారు 16 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. నిర్వహణలో భాగంగా ఎంపికైన కాంట్రాక్టర్ ప్రతి రోజు స్వీపింగ్ యంత్రాలతో పనులు నిర్వహించాల్సి ఉంటుంది. సైకిల్ ట్రాక్ పొడవునా గుంతలు, పగుళ్లు లేకుండా చూడడంతో పాటు డ్రైనేజ్ చాంబర్స్ను శుభ్రంగా నిర్వహించాలి. ఇలా మొత్తం 23 కి.మీ మార్గంలో ఉన్న సైకిల్ ట్రాక్ నిర్వహణను హెచ్ఎండీఏ సూచించిన విధంగా కాంటాక్టు సంస్థ ఏడాది పొడువునా నిర్వహణ కార్యకలాపాలు చేపట్టాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.